Page Loader
Olympics Cricket: 2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో క్రికెట్‌ పోటీలు.. త్వరలోనే క్వాలిఫికేషన్‌ ప్రక్రియ ప్రకటన 
2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో క్రికెట్‌ పోటీలు.. త్వరలోనే క్వాలిఫికేషన్‌ ప్రక్రియ ప్రకటన

Olympics Cricket: 2028 ఒలింపిక్స్‌లో ఆరు జట్లతో క్రికెట్‌ పోటీలు.. త్వరలోనే క్వాలిఫికేషన్‌ ప్రక్రియ ప్రకటన 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
10:59 am

ఈ వార్తాకథనం ఏంటి

శతాబ్ద కాలం గడిచిన తర్వాత, క్రికెట్‌ క్రీడ మళ్లీ ఒలింపిక్స్‌ వేదికపైకి రానుంది. 2028లో లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించనున్న ఒలింపిక్‌ క్రీడల్లో క్రికెట్‌ భాగంగా ఉండబోతోంది. దాదాపు 128 సంవత్సరాల విరామం తర్వాత ఇది జరగనుండడం విశేషం. ఈ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం, ఈ టోర్నీలో ఆరు జట్లు పాల్గొననున్నట్లు నిర్వాహకులు తేల్చారు. ఇక ఆతిథ్య దేశమైన అమెరికాకు నేరుగా ప్రవేశం (డైరెక్ట్ ఎంట్రీ) దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ క్రికెట్‌ పోటీలు పురుషులు, మహిళల విభాగాల్లో టీ20 ఫార్మాట్‌లో జరిగే అవకాశం ఉంది. అయితే, జట్ల అర్హత (క్వాలిఫికేషన్) ప్రక్రియను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు.

వివరాలు 

క్రికెట్‌కు సంబంధించి ఆరు జట్లపై నిర్ణ

అమెరికా ఆతిథ్యమిచ్చే దేశంగా ఉండటంతో,వారి ప్రాతినిధ్యం ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మిగిలిన ఐదు జట్లను ఎంపిక చేయడం కోసం ప్రత్యేకమైన ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రస్తుతానికి టెస్టులు,వన్డేలు కాకుండా,ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100దేశాలు టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ ఆడుతున్న నేపథ్యంలో తుది జట్ల ఎంపిక చేయడం ఓ సవాలుగా మారిందని నిర్వాహకులు భావిస్తున్నారు. 2028లో జరగబోయే లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌ ఈవెంట్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)ఎగ్జిక్యూటివ్ బోర్డు ఇటీవల ఆమోదించింది. ఇదే సమావేశంలో క్రికెట్‌కు సంబంధించి ఆరు జట్లపై నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. మొత్తం 351 మెడల్‌ ఈవెంట్లను నిర్వహించాలని వారు నిర్ణయించారు.క్రికెట్‌తో పాటు బేస్‌బాల్-సాఫ్ట్‌బాల్‌,ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌,లక్రాస్‌ (సిక్స్‌),స్క్వాష్‌ వంటి క్రీడలకు కూడా ఈ ఒలింపిక్స్‌లో చోటు కల్పించారు.

వివరాలు 

1900.. అదే మొదలు.. చివర.. 

క్రికెట్‌ తొలి సారి ఒలింపిక్స్‌లో ప్రవేశించింది 1900 సంవత్సరంలో.అయితే అది ఒక్కసారి మాత్రమే! ఆ పోటీలో బ్రిటన్‌కు చెందిన డెవాన్ అండ్ సోమర్‌సెట్ వాండరర్స్ క్లబ్,ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఎవ్వరికీ జాతీయ స్థాయి గుర్తింపు లేకపోవడంతో,అలాగే 12 మంది చొప్పున జట్లలో పాల్గొనడంతో దీనికి ఫస్ట్ క్లాస్ హోదా ఇవ్వలేదు. ఆ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో బ్రిటన్‌ 117 పరుగులు చేయగా, ఫ్రాన్స్‌ 78 పరుగులకే ఆలౌటైంది.

వివరాలు 

బ్రిటన్‌కు రజత పతకం, ఫ్రాన్స్‌కు కాంస్య పతకం

తర్వాత బ్రిటన్‌ రెండో ఇన్నింగ్స్‌ను 145/5 వద్ద డిక్లేర్‌ చేయగా, ఫ్రాన్స్‌ 26 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా బ్రిటన్‌ 158 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రారంభంలో బ్రిటన్‌కు రజత పతకం, ఫ్రాన్స్‌కు కాంస్య పతకం అందించగా, తరువాత వాటిని పసిడి, రజత పతకాలుగా మార్చారు. అనంతరం వివిధ కారణాల వల్ల క్రికెట్‌ను ఒలింపిక్‌ క్రీడల నుండి తొలగించారు.