Loading...
PV Sindhu: చైనా ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు ప్రయాణం .. పోరాడి ఓడిన భారత స్టార్
చైనా ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు ప్రయాణం .. పోరాడి ఓడిన భారత స్టార్

PV Sindhu: చైనా ఓపెన్‌లో ముగిసిన పీవీ సింధు ప్రయాణం .. పోరాడి ఓడిన భారత స్టార్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 23, 2026
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత అగ్ర షట్లర్‌ పీవీ సింధు ప్రీక్వార్టర్‌ ఫైనల్‌ దశలోనే తన పోరాటాన్ని ముగించింది. గురువారం జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌, ఆతిథ్య దేశానికి చెందిన చెన్‌ యుఫేయీ 16-21, 22-20, 21-18 స్కోరుతో సింధుపై విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. గంటా 29 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో చివరి పాయింట్‌ వరకు ఇద్దరు క్రీడాకారిణులు సమాన స్థాయిలో పోటీ పడటం అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవల జపాన్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన సింధు తొలి గేమ్‌లో అద్భుత ఆటతీరును కనబరిచి ఆధిపత్యం చాటింది.

వివరాలు

ప్రేక్షకులకు ఉత్కంఠభరిత అనుభూతి..

రెండో గేమ్‌లో కూడా విజయానికి చేరువైన ఆమెకు నాలుగు మ్యాచ్‌ పాయింట్లు లభించినప్పటికీ, వాటిని విజయంగా మలచడంలో విఫలమైంది.

ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చెన్‌ యుఫేయీ రెండో గేమ్‌ను కైవసం చేసుకుని మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది.

తుది గేమ్‌లోనూ ఇద్దరూ హోరాహోరీగా తలపడగా, చివరి దశలో కీలక పాయింట్లను వరుసగా సాధించిన యుఫేయీ మ్యాచ్‌పై పట్టు సాధించి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

గతవారం జపాన్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో సింధు చేతిలో ఎదురైన పరాజయానికి యుఫేయీ ప్రతీకారం తీర్చుకున్నట్లైంది.

ఈ ఓటమితో చైనా ఓపెన్‌లో పీవీ సింధు ప్రస్థానం ముగిసినప్పటికీ, మ్యాచ్‌ మొత్తం అత్యున్నత స్థాయి ర్యాలీలు, పోటీ తత్వం, పోరాట స్ఫూర్తితోసాగి ప్రేక్షకులకు ఉత్కంఠభరిత అనుభూతిని అందించింది.

ADVERTISEMENT