Lalit Modi: రూ.10-12 కోట్లు నాకు వారం రోజులు కూడా సరిపోవు.. లలిత్ మోదీ షాకింగ్ కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్ లలిత్ మోదీ తనపై భారత్లో నమోదైన కేసుల్లో ఎలాంటి తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. లండన్లో ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, తాను "డైమండ్ స్పూన్తో పుట్టిన వ్యక్తిని" అని పేర్కొంటూ, తనపై ఆరోపణలు చేస్తున్న మొత్తాలు తనకు వారం రోజుల ఖర్చుకూ సరిపోవని వ్యాఖ్యానించారు. "నేను ఎలాంటి తప్పూ చేయలేదు. నేను డైమండ్ స్పూన్తో పుట్టానని ముందే చెప్పాను. కొద్ది కోట్ల రూపాయలు తీసుకున్నానని నాపై ఆరోపణలు చేస్తున్నారు. కానీ నా జీవితంలో నేను రోజుకు అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను" అని లలిత్ మోదీ తెలిపారు.
వివరాలు
అలాంటి ఆరోపణలు ఎలా చేస్తారు?
ఐపీఎల్ను స్థాపించి, తొలి సంవత్సరాల్లో టోర్నీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన మోదీ, తనపై వచ్చిన ఆరోపణల కారణంగా తన జీవనశైలిలో ఎలాంటి మార్పు చేయబోనని చెప్పారు. "నేను అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నాను. ఎంతో విలాసవంతమైన జీవితం గడుపుతున్నాను. ప్రపంచమంతా తిరుగుతుంటాను. అది ఎలా సాధ్యమవుతుందనుకుంటున్నారు?" అని ప్రశ్నించారు. తనపై వచ్చిన ఆరోపణలను ప్రస్తావిస్తూ, "ఏమిటి ఈ ఆరోపణలు? నేను రూ.10 కోట్లు లేదా రూ.12 కోట్లు తీసుకున్నానంటున్నారు. ఆ మొత్తం నాకు వారం రోజులకైనా సరిపోదు" అని మోదీ అన్నారు. తన జీవనశైలి కొత్తది కాదని, అది తన కుటుంబ నేపథ్యం నుంచే వచ్చిందని చెప్పారు.
వివరాలు
వారి ఆధారంగానే జీవిస్తున్నా..
వ్యాపారాలు, పలు సంస్థల ద్వారా డబ్బు సంపాదించానని మోదీ తెలిపారు. అందులో మోదీ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ కూడా ఒకటని చెప్పారు. "అన్నింటినీ నేనే ఏర్పాటు చేశాను. నా జీవితంలో వందల మిలియన్ల డాలర్లు సంపాదించాను. అది మోదీ కుటుంబ సంపద కాదు. నేను స్వయంగా సంపాదించిన డబ్బు. అయితే దాన్ని ఖర్చు చేసే హక్కు నాకు ఎందుకు ఉండకూడదు?" అని ఆయన ప్రశ్నించారు. తన కుటుంబ వ్యాపారాల గురించి కూడా మోదీ మాట్లాడారు. ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉందని, దాని మార్కెట్ విలువ సుమారు రూ.2.5 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఆ సంస్థ యాజమాన్యాన్ని తన పిల్లలకు బదిలీ చేశానని, ప్రస్తుతం తాను వారిఆధారంగా జీవిస్తున్న తండ్రినని తెలిపారు.
వివరాలు
ఎవరి దగ్గర చేయి చాచలేదన్న లలిత్ మోదీ..
ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులను ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా గురించి కూడా మోదీ మాట్లాడారు. మాల్యా తన స్నేహితుడని చెప్పారు. "విజయ్ మాల్యా కథ వేరు. ఆయన సమస్య ఏమిటో నాకు పూర్తిగా తెలియదు. కానీ అది బ్యాంకులు, వాటికి సంబంధించిన అంశాల గురించి" అని మోదీ తెలిపారు. అలాగే, మాల్యా కేసుకు తన కేసుకు మధ్య తేడా ఉందని మోదీ అన్నారు. తన వ్యాపారాలు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు లేదా ప్రజాధనంపై ఆధారపడలేదని పేర్కొన్నారు. "మేము ఎప్పుడూ అప్పులు తీసుకోలేదు. నేను ఎవరి నుంచి డబ్బు తీసుకోలేదు. నేను ఎప్పుడూ డబ్బు ఇచ్చిన వాడినే. చెల్లించిన వాడినే" అని లలిత్ మోదీ చెప్పారు.