Sanju Samson: ధోని రికార్డ్ బ్రేక్.. వేగంగా 200 సిక్సర్లు బాదిన సంజు శాంసన్
ఐపీఎల్ లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన భారతీయుడిగా సంజు శాంసన్ నిలిచాడు. భారతీయ బ్యాటర్లలో ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోని 165మ్యాచ్ లలో 200సిక్సుల మైలురాయిని చేరుకున్నాడు. సంజూ శాంసన్ కేవలం 159ఇన్నింగ్స్ లలోనే 200సిక్సులు బాది ధోనీ రికార్డును అధిగమించాడు. ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. 222పరుగుల భారీ లక్ష్య చేధనలో రాజస్థాన్ రాయల్స్ జట్టు బ్యాటర్లు తడబడ్డారు. 20ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి కేవలం 201పరుగులు మాత్రమే చేయగలిగారు.
10వ స్థానంలో సంజూ
ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కేవలం 46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇందులో ఆరు సిక్సులు, ఎనిమిది ఫోర్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సంజూ బద్దలు కొట్టాడు. విరాట్ కోహ్లీ 180 ఇన్నింగ్స్ లలో, రోహిత్ శర్మ 185 మ్యాచ్ లలో, సురేష్ రైనా 193 మ్యాచ్ లలో 200 సిక్సుల మైలురాయిని చేరుకున్నారు. మరోవైపు ఐపీఎల్ చరిత్రలో 200 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన బ్యాటర్లలో 10వ స్థానంలో సంజూ నిలిచాడు. ఢిల్లీ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది.