Page Loader
Jasprit Bumrah: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. బుమ్రా వైస్‌ కెప్టెన్సీ నుంచి ఔట్‌?
ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. బుమ్రా వైస్‌ కెప్టెన్సీ నుంచి ఔట్‌?

Jasprit Bumrah: ఇంగ్లండ్ టూర్‌కు ముందు టీమిండియాకు షాక్‌.. బుమ్రా వైస్‌ కెప్టెన్సీ నుంచి ఔట్‌?

వ్రాసిన వారు Jayachandra Akuri
May 05, 2025
12:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా అభిమానులకు ఇది కొంతవరకూ నిరాశ కలిగించే విషయమే. జూన్‌లో ఇంగ్లండ్‌లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌కు సంబంధించి జస్పిత్ బుమ్రాను వైస్ కెప్టెన్ పదవిలో కొనసాగించలేమని బీసీసీఐ భావిస్తున్నట్టు సమాచారం. బుమ్రా అన్ని టెస్టుల్లో పాల్గొనే అవకాశం లేదన్న కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బుమ్రా స్థానంలో ఒక యువ క్రికెటర్‌కు బాధ్యతలు అప్పగించాలని సెలెక్షన్ కమిటీ యోచిస్తోంది. గతంలో రోహిత్ శర్మ గైర్హాజరైన సమయంలో బుమ్రానే టీమిండియాను నాయకత్వం వహించిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో మొదటి, చివరి టెస్టులలో బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు.

Details

టోర్నీ మధ్యలోనే తప్పుకున్న బుమ్రా

మొదటి మ్యాచ్‌ విజయం సాధించినా, చివరి టెస్టులో గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి వెన్నునొప్పి (బ్యాక్ ఇంజ్యూరీ)తో బుమ్రా చాలా కాలం జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున బుమ్రా అద్భుత ప్రదర్శన చేస్తూ, ఫిట్‌నెస్ ప్రూవ్ చేస్తున్నా.. టెస్టుల్లాంటి ఫార్మాట్‌లో పది రోజుల పాటు ఏకధాటిగా బౌలింగ్ చేయగలిగే స్థితిలో లేనట్లు బీసీసీఐ భావిస్తోంది. ఐదు టెస్టుల్లో కేవలం మూడు మ్యాచ్‌లకే బుమ్రా అందుబాటులో ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ, పూర్తి సిరీస్‌లో లభ్యమయ్యే ప్లేయర్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలని యోచనలో ఉంది.

Details

వైస్ కెప్టెన్ రేసులో రిషబ్ పంత్, గిల్

కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతుండగా, వైస్ కెప్టెన్సీ కోసం శుభమన్ గిల్, రిషబ్ పంత్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. శుభమన్ గిల్ ఇప్పటికే వన్డేల్లో భారత్‌కు నాయకత్వం వహించడమే కాకుండా, ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక రిషబ్ పంత్‌కి టీ20 ఫార్మాట్‌లో భారత జట్టును లీడ్ చేసిన అనుభవం ఉంది. వీరిద్దరిలో ఒకరికి ఉపనాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశముందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న టీమిండియా.. ఇంగ్లండ్ టూర్‌ను గెలవాలని ప్రణాళికలు రచిస్తోంది. అయితే బుమ్రా ఫిట్‌నెస్ పరిస్థితి, వైస్ కెప్టెన్ ఎంపికపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూడాల్సిందే.