Page Loader
IND vs NZ: టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం!
టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం!

IND vs NZ: టీమిండియాకు షాక్‌.. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌కు రోహిత్ దూరం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 28, 2025
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన తదుపరి మ్యాచ్‌ను మార్చి 2న న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మకు విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా శుభ్‌మాన్ గిల్ వ్యవహరించనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం శుభ్‌మాన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ గాయపడిన తర్వాత కొద్దిసేపు గిల్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత రోహిత్ తిరిగి మైదానంలోకి వచ్చినా పూర్తిగా ఫిట్‌గా కనిపించలేదు.

Details

ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కానీ రోహిత్

మరోవైపు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ ఇద్దరూ బుధవారం జరిగిన బ్యాటింగ్ ప్రాక్టీస్ సెషన్‌కు హాజరు కాలేదు. ఈ కారణంగా గిల్‌కు ఆరోగ్య సమస్యలున్నాయనే వార్తలొచ్చాయి. అయితే గురువారం గిల్ ప్రత్యేక ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనడంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటే, రిషబ్ పంత్ జట్టులో చేరే అవకాశం ఉంది. శుభ్‌మాన్ గిల్‌తో కలిసి కెఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించవచ్చు. మరోవైపు టీమిండియాలో బ్యాకప్ ఓపెనర్ లేడు. దీంతో యశస్వి జైస్వాల్ జట్టులో స్థానం పొందడం లేదు. మొదట అతన్ని జట్టులోకి తీసుకున్నా చివరి నిమిషంలో ట్రావెలింగ్ రిజర్వ్‌గా మారాడు. ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి టాప్-15లో స్థానం సంపాదించుకున్నాడు.