Ricky Ponting: రోహిత్ 2027 వన్డే ప్రపంచకప్ ఆడాలి :ఆస్ట్రేలియా మాజీ
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ఫామ్, భవిష్యత్పై వచ్చిన విమర్శలకు ఈ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy)తో గట్టి సమాధానం ఇచ్చాడు.
తాను ఇప్పుడే రిటైర్ కాబోయే ప్రసక్తే లేదని స్పష్టంగా ప్రకటించాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం హిట్మ్యాన్ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.అయితే ఆ ఊహాగానాలకు స్వయంగా తెరదించాడు.
మ్యాచ్ విజేతగా నిలిచిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశాడు.
భవిష్యత్ ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ స్పందించాడు.
తనకు భవిష్యత్తు గురించి ఇప్పుడే ఎలాంటి ప్రణాళికలు లేవని పేర్కొన్నాడు.
తన రిటైర్మెంట్ గురించి అనవసరమైన ప్రచారం వద్దని,వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే రిటైర్ కావడం లేదని స్పష్టతనిచ్చాడు.
వివరాలు
రిటైర్మెంట్ గురించి చర్చించటం సహజం
సుదీర్ఘ కాలం క్రికెట్ ఆడిన ఆటగాళ్లకు ఇంకా ఆడాలనే ఆసక్తి ఉంటుందని వివరించాడు.
ఈ నేపథ్యంలో,2027 వన్డే ప్రపంచకప్లో అతడు ఆడతాడా? అనే అంశంపై చర్చ ప్రారంభమైంది.
ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (Ricky Ponting) తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
కెరీర్ ఓ దశకు వచ్చినప్పుడు అందరూ రిటైర్మెంట్ గురించి చర్చించటం సహజమని పాంటింగ్ చెప్పాడు.
వివరాలు
అన్ని ట్రోఫీలను గెలుచుకోవాలనే లక్ష్యంతో రోహిత్
''మీరు మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయో నాకు అర్థం కాదు. కానీ రోహిత్ తనదైన శైలిలో స్పందించాడు. తనకు జట్టులో కొనసాగడం ఇష్టమని, నాయకత్వం వహించడం ఆనందంగా ఉంటుందని స్పష్టంగా తెలిపాడు. అతడి మాటల్లో వచ్చే ప్రపంచకప్ ఆడాలన్న లక్ష్యం కనిపిస్తోంది. గత వన్డే ప్రపంచకప్ను కోల్పోయాడు. అందుకే మరో ప్రపంచకప్ ఆడి జట్టుకు టైటిల్ అందించాలని అతడు కోరుకుంటున్నాడని నా అభిప్రాయం'' అని పాంటింగ్ విశ్లేషించాడు.
ఐసీసీ వైట్బాల్ ఫార్మాట్లో అన్ని ట్రోఫీలను గెలుచుకోవాలనే లక్ష్యంతో రోహిత్ మరో వన్డే ప్రపంచకప్ ఆడటానికి అర్హుడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రోహిత్ ప్రదర్శనను గమనించిన వారెవరైనా అతడి కెరీర్ ముగిసిందని చెప్పగలరా? అంటూ ప్రశ్నించాడు.