Page Loader
Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు 
పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి వీడియో విడుదల

Pakistan: పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ పై దాడి.. షాకింగ్ వీడియో విడుదల చేసిన బలూచ్ తిరుగుబాటుదారులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2025
09:52 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ పారామిలటరీ దళాల కాన్వాయ్‌పై బలూచిస్థాన్ తిరుగుబాటుదారులు ఆదివారం ఆత్మాహుతి దాడి జరిపిన సంగతి తెలిసిందే. బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మిలిటెంట్లు ఈ దాడిని నిర్వహించగా, ముగ్గురు పాకిస్తాన్ సైనికులతో పాటు మొత్తం ఐదుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. తాజాగా, ఈ దాడికి సంబంధించిన వీడియోను బీఎల్ఏ విడుదల చేసింది. బలూచిస్థాన్‌లోని నోష్కి సమీపంలో జాతీయ రహదారిపై పారామిలటరీ బలగాల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ఘటన 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ బలగాలపై జరిగిన ఆత్మాహుతి దాడిని తలపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

దాడి విధానం

ఈ కాన్వాయ్‌లో మొత్తం ఏడు బస్సులు, రెండు కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసినవారు ప్రధానంగా రెండో బస్సును లక్ష్యంగా చేసుకుని, మొదటి ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోసివ్ డివైస్) ఉన్న వాహనాన్ని బస్సును ఢీకొట్టించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా, బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. అనంతరం, వెనుక ఉన్న మరో బస్సుపై రాకెట్ ప్రొపెల్లడ్ గ్రెనేడ్ విసిరి కాల్పులు జరిపారు. ఈ దాడిని 'ది మజీద్ బ్రిగేడ్' అనే బీఎల్ఏ విభాగం నిర్వహించగా, 'ఫతేహ్ స్వ్యాడ్' అనే మరో మిలిటెంట్ గ్రూప్ రెండో బస్సును చుట్టుముట్టింది. ప్రస్తుతం, ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బలూచ్ తిరుగుబాటుదారులు విడుదల చేసిన వీడియో ఇదే..

వివరాలు 

అధికారుల ప్రకటన

భద్రతా బలగాల కాన్వాయ్ క్వెట్టా నుండి తఫ్తాన్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని, మొత్తం ఏడు బస్సులు, రెండు కార్లు మిలిటెంట్ల లక్ష్యంగా మారినట్లు పాక్ సైనిక అధికారులు పేర్కొన్నారు. దాడికి ఉపయోగించిన వాహనం పేలుడు పదార్థాలతో నిండి ఉన్నట్లు పాక్ పోలీసులు నిర్ధారించారు. కాన్వాయ్‌పై వాహనాన్ని ఢీకొట్టిన అనంతరం మిలిటెంట్లు కాల్పులు జరిపారని, అయితే, భద్రతా బలగాలు ప్రతిఘటించి వారిని తిప్పికొట్టాయని తెలిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారని, మొత్తం ఐదుగురు (మూడు సైనికులు సహా) మరణించారని స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రభుత్వ ప్రతిస్పందన

ఈ ఘటనను పాకిస్థాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద చర్యలు పాక్ ప్రభుత్వాన్ని భయపెట్టలేవని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు. గత వారం రోజుల వ్యవధిలో బీఎల్ఏ మిలిటెంట్లు రెండు ప్రధాన దాడులు నిర్వహించడం గమనార్హం. గతవారం క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును బీఎల్ఏ హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇందులో పాక్ సైనికులు కూడా ఉన్నారు. బలూచిస్థాన్‌లో బీఎల్ఏ ప్రభావం: ఇరాన్, అఫ్గాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచిస్థాన్ ప్రాంతంలో బలోచ్ లిబరేషన్ ఆర్మీ అత్యంత శక్తివంతమైన వేర్పాటువాద సంస్థగా ఉంది. తరచూ పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ దాడులు కొనసాగిస్తోంది.