Page Loader
Pakistan: భద్రతా బలగాలపై బలోచ్‌ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు
భద్రతా బలగాలపై బలోచ్‌ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు

Pakistan: భద్రతా బలగాలపై బలోచ్‌ తిరుగుబాటు.. ముగ్గురు మృతి.. 18మందికి గాయాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 15, 2025
02:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్‌లో మంగళవారం ఘోర దాడి జరిగింది. భద్రతా బలగాలను తీసుకెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి జరిగిన ఘటనలో ముగ్గురు భద్రతాధికారులు ప్రాణాలు కోల్పోగా, మరో 18 మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో వాయువ్య పాకిస్తాన్‌లో ఇద్దరు పోలియో వర్కర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్టు సమాచారం. ఈ దాడి బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని మస్టంగ్‌ ప్రాంతంలో చోటుచేసుకుంది. భద్రతా సిబ్బందితో కూడిన వాహనంపై ఇది మొదటి దాడిగా అధికార ప్రతినిధి షహిద్‌ రిండ్‌ వెల్లడించారు. ది బలోచిస్థాన్‌ కానిస్టేబుళ్ల బృందం కలాత్‌ నుంచి తిరిగి వస్తుండగా దాడి జరిగిందని తెలిపారు. వేర్పాటువాదులే ఈ దాడికి పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.

Details

మొత్తం 40మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం

దాడిలో పేలుడుకి కారణమైన ఐఈడీ (ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోసివ్‌ డివైస్‌) ఉపయోగించారని భావిస్తున్నారు. అయితే ఈ దాడికి ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థా బాధ్యత వహించలేదు. దాడి జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 40 మంది పోలీస్‌ సిబ్బంది ఉన్నారు. గాయపడినవారిలో తీవ్రంగా గాయపడిన వారిని క్వెట్టా నగరంలోని ప్రధాన ఆసుపత్రికి తరలించగా, స్వల్ప గాయాలతో బయటపడ్డ వారిని స్థానిక వైద్య కేంద్రాల్లో చికిత్సనందిస్తున్నారు. ఈ దాడిని పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదంపై పోరాటం కొనసాగుతుందని, అది ఎప్పటికీ ఆగదని షరీఫ్‌ స్పష్టం చేశారు. ఇక గత నెలలోనూ బలోచిస్థాన్‌లో భద్రతా బలగాలను తరలిస్తున్న జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై తీవ్ర దాడి జరిగింది.

 Detals

182 మంది ప్రయాణికులు బందీలుగా ఉంచారు

క్వెట్టా నుంచి పెషావర్‌కు వెళ్తున్న ఈ రైలు 17 సొరంగాల మార్గంలో ప్రయాణించగా, 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చి రైలును ఆపేశారు. అనంతరం దాన్ని తమ నియంత్రణలోకి తీసుకొని భారీగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో దాదాపు 182 మంది ప్రయాణికులను మిలిటెంట్లు బందీగా ఉంచారు. పాకిస్థాన్‌ మొత్తం భూభాగంలో దాదాపు 44శాతం బలోచిస్థాన్‌ ప్రావిన్స్‌లోనే ఉంది. ఇక్కడ చమురు, బొగ్గు, బంగారం, రాగి, సహజ వాయువు వంటి విలువైన వనరులు విస్తరించి ఉన్నాయి. ఇవి దేశ ఖజానాకు భారీ ఆదాయం సమకూరుస్తున్నా, రాష్ట్రంలో అధిక పేదరికం కనిపిస్తోంది. కోటిన్నర జనాభా కలిగిన ఈ పర్వతప్రాంతంలో నివసించే ప్రజలు, దశాబ్ధాలుగా ప్రత్యేక దేశంగా ఏర్పడాలనే ఆందోళనతో వేర్పాటువాద పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.