China: చైనాలో దారుణం.. కత్తితో దాడి చేసి 8 మందిని చంపిన వ్యక్తి
సెంట్రల్ చైనాలో ఒక వ్యక్తి కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి 8 మందిని చంపిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 8 మంది చనిపోగా, ఒకరు గాయపడినట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ అక్కడి మీడియా శుక్రవారం నివేదించింది. ఈ సంఘటన గురువారం(మే 23)ఉదయం హుబీ ప్రావిన్స్లోని జియోగన్లో జరిగింది. 53 ఏళ్ల నిందితుడిని 'లూ'గా గుర్తించారు.ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు గతంలో మానసిక అనారోగ్యానికి సంబంధించిన చికిత్స పొందాడని అధికారులు తెలిపారు. దాడి చేసిన నిందితుడిని ప్రస్తుతం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉందని,ప్రాణాపాయం లేదని వార్తా సంస్థ జిన్హువా పేర్కొంది. చైనాలో ఇటీవల కాలంలో సామూహిక నేరాలు తరుచుగా జరుగుతున్నాయి.
చైనాలో కత్తితో దాడి సర్వసాధారణంగా మారింది
సాధారణంగా చైనాలో సామూహిక హింసాత్మక నేరాలు ఎప్పుడో ఒకసారి జరుగుతుంటాయి. అక్కడి పౌరులు తుపాకీలు లేదా ఇతర మరణాయుధాలు కలిగి ఉండటం నిషేధం. ఈ మధ్య ప్రారంభంలో, జియాంగ్జీ ప్రావిన్స్లోని ఒక ప్రాథమిక పాఠశాలలో పండ్ల కత్తితో ఒక మహిళ ఇద్దరు వ్యక్తులను చంపి, నలుగురిని గాయపరిచింది. ఇదే నెలలో, నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లోని ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తి కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆసుపత్రిలో పలువురిపై దాడి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన వారిపై సైతం కత్తితో బెదిరించాడు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో అక్కడ ఉన్నవారంత కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, 21 మంది గాయపడ్డారు.