CHINA: ఇజ్రాయెల్కు చైనా సంచలన మద్ధతు.. హమాస్ దాడులపై డ్రాగన్ ఏమందో తెలుసా
ఇజ్రాయెల్కు చైనా సంచలన మద్ధతు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశంపై హమాస్ దాడిని ఇన్నాళ్లు ఖండించేందుకు తటపటాయించిన చైనా ఇప్పడు మనసు మార్చుకుంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చైనా విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ బీజింగ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగానే ప్రతి దేశానికీ ఆత్మరక్షణ హక్కు ఉంటుందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం పేర్కొన్నారు. అంతర్జాతీయ మావనతా చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని, ప్రజలకు రక్షణ కల్పించేలా చర్యలు ఉండాలన్నారు. చైనా విదేశాంగ మంత్రి అమెరికా పర్యటనకు ముందు ఈ పరిణామం జరగడం విశేషం. యుద్ధం ప్రారంభం తర్వాత ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రితో తొలిసారిగా ఫోన్లో మాట్లాడిన యూ ఈ మేరకు మద్ధతు ప్రకటించారు.
సామాన్యులకు హాని కలిగించే అన్ని చర్యలను వెంటనే ఆపేయాలి : చైనా
హమాస్ పై చర్యలు తీసుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని చైనా తొలిసారిగా అంగీకరించింది. ఈజిప్ట్తోపాటు ఇతర అరబ్ దేశాలతో కలిసి పాలస్తీనా సమస్యకు త్వరితగతిన పరిష్కారం కోసం సమన్వయం చేస్తామన్నారు. మరోవైపు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలోనే ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతుండటంపై వాంగ్ యీ ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధంతో ప్రజల ప్రాణాలు పోతుండటంపై ఆవేదన తెలిపారు. సామాన్యులకు హాని కలిగించే అన్ని చర్యలను వెంటనే ఆపేయాలని కోరారు. వాంగ్ యీ అక్టోబర్ 26 నుంచి 28 మధ్య అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్తో భేటీ కానున్నారు. ఈ క్రమంలోనే డ్రాగన్ చైనా నుంచి ఇజ్రాయెల్ దేశానికి సానుకూల ప్రకటన కీలకంగా మారనుంది.