Page Loader
Earthquake:కూలిపోయిన బ్యాంకాక్ ఆకాశహర్మ్యం నుండి పత్రాల 'చోరీ'కి యత్నాలు: అరెస్టు
కూలిపోయిన బ్యాంకాక్ ఆకాశహర్మ్యం నుండి పత్రాల 'చోరీ'కి యత్నాలు: అరెస్టు

Earthquake:కూలిపోయిన బ్యాంకాక్ ఆకాశహర్మ్యం నుండి పత్రాల 'చోరీ'కి యత్నాలు: అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 31, 2025
12:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

గత వారం మయన్మార్‌, థాయిలాండ్‌లో సంభవించిన భూకంపాలు తీవ్ర వేదనను మిగిల్చాయి. ఈ ప్రకంపనల ప్రభావంతో థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో ఉన్న 33 అంతస్తుల భారీ భవనం కుప్పకూలిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. అయితే, తాజాగా ఈ ఘటనకు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ భవన నిర్మాణానికి చైనా సంస్థకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం, దీంతో అధికారులు ఈ కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. అంతేగాక, ఈ భవనం శిథిలాల వద్దకి నలుగురు చైనీయులు అనుమతి లేకుండా ప్రవేశించి, కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

ఘటన వివరాలు 

భూకంప ప్రభావంతో 33 అంతస్తుల ఈ భవనం నేలమట్టం కావడంతో అనేక మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీసినట్లు సమాచారం. భూకంపం తీవ్రత అధికంగానే ఉన్నప్పటికీ, అదే ప్రాంతంలోని ఇతర భవనాలు నిలిచుండటంతో ఈ ఒక్క భవనమే కూలిపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని అనుతిన్ చార్న్‌విరాకుల్ స్వయంగా పరిశీలించి, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆదేశించారు. డిజైన్‌లో లోపాలు ఉండే అవకాశాన్ని ఆయన అనుమానించారు.

వివరాలు 

భవన నిర్మాణం - చైనా సంస్థ ప్రమేయం 

ఈభవనం థాయ్‌లాండ్‌ స్టేట్‌ ఆడిట్‌ ఆఫీస్‌ ప్రధాన కార్యాలయంగా నిర్మించబడుతోంది. ఈ నిర్మాణ ప్రాజెక్ట్‌ను 58బిలియన్‌ డాలర్ల వ్యయంతో చేపట్టారు.గత మూడేళ్లుగా ఇది ఇంకా పూర్తికాలేదు. నిర్మాణ బాధ్యతలు ఇటాలియన్‌-థాయ్‌ డెవలప్‌మెంట్ కంపెనీతో పాటు చైనా రైల్వే నంబర్‌ 10 (థాయ్‌లాండ్‌)లిమిటెడ్‌ అనే సంస్థకు ఉన్నాయి. ఈ కంపెనీ చైనా రైల్వే నంబర్‌ 10 ఇంజినీరింగ్‌ గ్రూప్‌ అనుబంధంగా 2018లో థాయ్‌లాండ్‌లో కార్యకలాపాలు ప్రారంభించింది. నివాస సముదాయాలతో పాటు ప్రభుత్వ రహదారులు, రైల్వే నిర్మాణ పనులను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. అయితే, 2023లో ఈ సంస్థకు భారీ నష్టాలు వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నాణ్యతలేని స్టీల్‌ వినియోగం లేదా నిర్మాణ లోపాల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

వివరాలు 

చైనా వ్యక్తుల అరెస్ట్‌ 

ఈ భవనం శిథిలాల వద్ద అనుమతి లేకుండా నలుగురు వ్యక్తులు ప్రవేశించి, కొన్ని కీలక పత్రాలను తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది. ఆదివారం భద్రతా సిబ్బంది వీరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు చైనా పౌరులని తెలిసింది. వారిలో ఒకరు తాను ప్రాజెక్ట్‌ మేనేజర్‌ అని చెప్పినట్లు సమాచారం. బీమా క్లెయిమ్‌ కోసం సంబంధిత పత్రాలు తీసుకెళ్లేందుకు వచ్చినట్లు వారు తెలిపినప్పటికీ, ఈ వ్యవహారంపై అధికారులు సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు 

మరణాల సంఖ్య 1700 దాటింది 

ఈ భూకంపం మయన్మార్‌, థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టం కలిగించింది. మృతుల సంఖ్య 1700కు పైగా చేరుకుంది. మయన్మార్‌లో అత్యధిక ప్రాణనష్టం సంభవించగా, బ్యాంకాక్‌లో ఇప్పటివరకు 18 మృతదేహాలను గుర్తించారు. అదనంగా, 83 మంది గల్లంతైనట్లు అధికారులు ప్రకటించారు.