Page Loader
USA: డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత
డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత

USA: డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం.. అమెరికాలోకి విలువైన ప్యాకేజీల పంపిణీ నిలిపివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 20, 2025
04:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోకి అధిక విలువ గల పార్శిళ్లను డెలివరీ చేయడంపై జర్మనీకి చెందిన ప్రముఖ కొరియర్ సంస్థ డీహెచ్‌ఎల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 800 డాలర్లకు పైగా విలువ ఉన్న ప్యాకేజీలను అమెరికాలో డెలివరీ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ట్రంప్‌ ప్రభుత్వంలో అమలవుతున్న కఠినమైన టారిఫ్‌లు, చెకింగ్‌ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అయితే బిజినెస్‌ టు బిజినెస్‌ షిప్‌మెంట్లు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కానీ వీటిలోనూ ఆలస్యం జరగవచ్చని హెచ్చరించింది. గతంలో 2,500 డాలర్ల వరకు విలువైన ప్యాకేజీలను తక్కువ పేపర్ వర్క్‌తోనే అమెరికాకు పంపే అవకాశం ఉండేదని డీహెచ్‌ఎల్‌ పేర్కొంది. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

Details

డెలవరీలపై కొత్త ఆంక్షలు

తనిఖీలు కఠినంగా మారడంతో పాటు, ఈ డెలివరీలపై కొత్త ఆంక్షలు అమలవుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం సంస్థ 800 డాలర్లకు తక్కువ విలువ కలిగిన ప్యాకేజీలను మాత్రమే అమెరికాకు డెలివరీ చేస్తోంది. అయితే వీటి విషయంలో కూడా చట్టపరమైన గ్యాప్‌లను మూసివేయాలని అమెరికా ప్రభుత్వం యత్నిస్తోంది. ముఖ్యంగా చైనా, హాంకాంగ్‌ నుంచి వచ్చే పార్శిళ్ల విషయంలో మరింత అప్రమత్తత చూపుతోంది. ట్రంప్‌ ప్రభుత్వం నా కొరియర్ సేవలను వినియోగించి, సింథటిక్ డ్రగ్స్‌ను అమెరికాలోకి చొరబెడుతున్నారన్న అనుమానంతో నిఘా పెంచింది. ఈ క్రమంలో ఒపియాడ్‌ మాదక ద్రవ్యాల పంపిణీపై నియంత్రణ విధించాలని అధికారులను ఆదేశించింది.

Details

డ్రగ్స్ పై కఠిన చట్టాలు

దీనిపై స్పందించిన చైనా, ఫెంటనిల్‌ను అమెరికా సమస్యగా అభివర్ణిస్తూ, తమ దేశంలో డ్రగ్స్‌పై కఠిన చట్టాలు ఉన్నాయని పేర్కొంది. ఇక ఇటీవలే హాంకాంగ్‌ పోస్టు సంస్థ కూడా అమెరికాకు షిప్‌మెంట్‌లను ఏప్రిల్‌ 27 నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సముద్ర మార్గంలో డెలివరీలను ఇకపై స్వీకరించమని స్పష్టం చేసింది. అమెరికా అకారణంగా వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా-ఆసియాన్‌ దేశాల మధ్య డెలివరీ వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారే అవకాశముంది.