Donald Trump: ఇంకా ఆలస్యం చేయొద్దు.. ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలను ఉపయోగించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేస్తూ, టెహ్రాన్ త్వరగా ఒప్పందానికి రావాలని హెచ్చరించారు. వైట్హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై యుద్ధంలో అణ్వాయుధాలు వినియోగించే ప్రణాళిక లేదని ట్రంప్ స్పష్టం చేశారు. "అణ్వాయుధం ఎందుకు ఉపయోగించాలి? సంప్రదాయ యుద్ధ పద్ధతులతోనే మేము ఇప్పటికే వారిని బలహీనపరిచాం. నేను దాన్ని ఉపయోగించను. ఎవరూ, ఎప్పుడూ అణ్వాయుధాలను ఉపయోగించకూడదు" అని ఆయన పేర్కొన్నారు. అలాగే, టెహ్రాన్తో ఒప్పందం విషయంలో తొందరపడటం లేదని, త్వరిత పరిష్కారం కంటే స్థిరమైన, దీర్ఘకాలిక ఒప్పందంపైనే దృష్టి పెట్టినట్లు తెలిపారు.
వివరాలు
సమయం మించిపోతోంది
ఇటీవల జరిగిన రెండు వారాల కాల్పుల విరమణ సమయంలో ఇరాన్ తన ఆయుధ వ్యవస్థలను పునరుద్ధరించి ఉండవచ్చని కూడా అభిప్రాయపడ్డారు. ఒప్పందానికి సంబంధించి ఇరాన్కు సమయం తగ్గిపోతుందని ట్రంప్ హెచ్చరించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ఆయన చేసిన పోస్టులో నాకు సమయం ఉంది, కానీ ఇరాన్కు లేదు. వారి సైన్యం కుప్పకూలిపోయింది. నాయకత్వం బలహీనమైంది. దిగ్బంధనం కఠినంగా కొనసాగుతోంది. ఇక పరిస్థితి మరింత దిగజారుతుందని వ్యాఖ్యానించారు.
వివరాలు
సీజ్ చేసిన నౌకపై వ్యాఖ్యలు
ఇటీవల ఇరాన్కు చెందిన జెండాతో ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకను అమెరికా స్వాధీనం చేసుకున్న విషయాన్ని ప్రస్తావించిన ట్రంప్, ఆ నౌకలో చైనా నుంచి ఇరాన్కు పంపిన 'బహుమతి' ఉందని తెలిపారు. అయితే అది ఏమిటనే విషయాన్ని వెల్లడించకుండా, అది అత్యంత రహస్యమని పేర్కొన్నారు. ఇరాన్పై విధించిన సముద్ర దిగ్బంధనాన్ని ప్రశంసిస్తూ, గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకోవడం, హర్ముజ్ జలసంధిలో సీ మైన్స్ ఏర్పాటు చేయడం ఇరాన్ చేసిన పెద్ద తప్పులని అన్నారు. ఇజ్రాయెల్-లెబనాన్ కాల్పుల విరమణ ఇదిలా ఉండగా ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణను మరో మూడు వారాలు పొడిగిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరుదేశాల నాయకులు త్వరలో వైట్హౌస్లో సమావేశమయ్యే అవకాశం ఉందని తెలిపారు.