
Trump: నోబెల్ శాంతి బహుమతికి డొనాల్డ్ ట్రంప్ పేరు నామినేట్.. అంతర్జాతీయంగా విమర్శలు!
ఈ వార్తాకథనం ఏంటి
నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్ష రోజురోజుకీ మరింతగా పెరుగుతోంది. తాజాగా ఆయన పేరును అధికారికంగా నామినేట్ చేశారు. అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు బడ్డీ కార్టర్ ఈ మేరకు నార్వేలోని నోబెల్ కమిటీకి లేఖ రాశారు. అసాధ్యమనుకున్న అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో కూడా వేగంగా శాంతి ఒప్పందాలు కుదిరేలా డొనాల్డ్ ట్రంప్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరేలా సహకరించారు. అలాగే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశానికి వినాశకర ఆయుధాలు చేరకుండా అడ్డుకున్నారు. ట్రంప్ నాయకత్వాన్ని నోబెల్ ప్రైజ్తో గుర్తించడం సముచితమని భావిస్తున్నామని కార్టర్ తన లేఖలో పేర్కొన్నారు.
Details
నామినేషన్లు, వివాదాలు
సాధారణంగా నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్లు చేసే హక్కు జాతీయ పార్లమెంట్ సభ్యులకు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లకు, అంతర్జాతీయ వ్యక్తులకు ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ తాను నోబెల్ ప్రైజ్ పొందకపోవచ్చని తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. తన సామాజిక మాధ్యమం 'ట్రూత్' లో పోస్ట్ చేస్తూ, "నేను ఏం చేసినా నాకెప్పుడూ నోబెల్ ప్రైజ్ రాదు. భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినా, సెర్బియా-కోసావో మధ్య ఘర్షణను నిలిపినా నాకే అది ఇవ్వరని విమర్శించారు.
Details
ఉక్రెయిన్ ప్రతిపాదన ఉపసంహరణ
ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ఉక్రెయిన్ చట్టసభ సభ్యుడు ఒలెక్సాండర్ మెరెఝాకో కూడా ప్రతిపాదించారు. కానీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో ట్రంప్ విఫలమవడంతో ఆయన తాజాగా నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. "నాకు ట్రంప్పై నమ్మకం పోయింది" అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో "తాను అధికారం చేపడితే 24 గంటల్లో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ హామీ ఇచ్చినప్పటికీ, ఆయన ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ అంగీకరించినా రష్యా అంగీకరించకపోవడమే ఆయన వైఫల్యానికి కారణమని చెప్పారు.
Details
పాక్ నామినేషన్ వివాదం
ఇక పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. కానీ మరుసటి రోజే ట్రంప్ ఇరాన్ పై బంకర్ బస్టర్ బాంబులతో దాడులు జరిపించడం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని షాక్ కు గురిచేసింది. ఈ పరిణామాలపై పాక్ లోని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని తప్పుబట్టాయి. నోబెల్ నామినేషన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. అంతే కాకుండా భారత్ కూడా పాక్ తో ఘర్షణను ట్రంప్ ఎప్పుడూ ఆపలేదని, నోబెల్ కి ఆయన అర్హుడు కాదని పలుమార్లు తేల్చిచెప్పింది.