బార్బెక్యూ రెస్టారెంట్లో గ్యాస్ పేలి 31మంది మృతి
చైనాలోని నింగ్జియా ప్రాంతంలో బుధవారం రాత్రి గ్యాస్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించినట్లు, ఏడుగురు గాయపడినట్లు ఆ దేశ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. నింగ్జియా హుయ్ అటానమస్ రీజియన్లోని యిన్చువాన్లో గల బార్బెక్యూ రెస్టారెంట్లో ఈ ప్రమాదం జరిగింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రెస్టారెంట్లోని పెట్రోలియం గ్యాస్ ట్యాంక్ నుంచి లీకేజీనే పేలుడుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. గాయపడిన వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు జిన్హువా పేర్కొంది. భద్రతను మెరుగుపరచడానికి కొనసాగుతున్న ప్రయత్నాలు ఉన్నప్పటికీ గ్యాస్, రసాయన పేలుళ్లతో కూడిన సంఘటనలు చైనాలో సర్వసాధారణం అని చెప్పాలి. 2015లో టియాంజిన్లో జరిగిన వరుస పేలుళ్లలో 173 మంది ప్రాణాలు కోల్పోయారు.