
India: బహ్రెయిన్లో 4 దశాబ్దాలుగా చిక్కుకున్న భారతీయుడు..ఎట్టకేలకు భారతదేశానికి..
ఈ వార్తాకథనం ఏంటి
ఉద్యోగం లేదా ఉన్నత విద్య కోసం ఎంతోమంది భారతీయులు విదేశాలకు వలస వెళ్తుంటారు.
అయితే, కొన్ని సందర్భాల్లో అక్కడి పరిస్థితుల వల్ల కొందరు ఆ దేశాల్లో చిక్కుకుపోతారు.
ఇలాంటి ఒక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 42 ఏళ్లుగా బహ్రెయిన్లో ఉన్న కేరళకు చెందిన గోపాలన్ చంద్రన్ ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చారు.
ఈ విషయాన్ని ప్రవాసీ లీగల్ సెల్ అనే ఎన్జీవో ఒక సోషల్ మీడియా పోస్టు ద్వారా వెల్లడించింది.
వారి వివరాల ప్రకారం,గోపాలన్ చంద్రన్ కేరళలోని పౌడికోణం సమీపంలోని ఓ చిన్న గ్రామానికి చెందినవారు.
1983లో ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన ఆయన అక్కడ యజమాని ఆకస్మికంగా మరణించడం వల్ల కష్టాల్లో పడ్డారు.
వివరాలు
ప్రవాసీ లీగల్ సెల్ ఒక సమాజ సేవా సంస్థ
ఈ పరిణామాల్లో తన పాస్పోర్టు కూడా కోల్పోయారు. అందువల్ల గోపాలన్ అక్కడే చిక్కుకుపోయారు.
తిరిగి స్వదేశానికి వచ్చే మార్గం తెలియక, నలభై రెండు సంవత్సరాలు విదేశంలోనే గడిపారు.
ఇటీవల ఫేస్ బుక్ ద్వారా గోపాలన్ తన పరిస్థితిని వివరించారు.ఒక వీడియోలో తన కుటుంబాన్ని చూసే ఆశతో బాధను వ్యక్తపరచారు.
ఈ వీడియో ప్రవాసీ లీగల్ సెల్ దృష్టికి రావడంతో,వారు వెంటనే చర్యలు ప్రారంభించారు.
బహ్రెయిన్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపి,గోపాలన్ను వెనక్కి తీసుకురావడంలో సహాయపడ్డారు.
ప్రవాసీ లీగల్ సెల్ ఒక సమాజ సేవా సంస్థగా పనిచేస్తోంది.ఈ సంస్థలో మాజి న్యాయమూర్తులు, న్యాయవాదులు,జర్నలిస్టులు పనిచేస్తున్నారు.
విదేశాల్లో అన్యాయంగా చిక్కుకుపోయిన భారతీయులను గుర్తించి, వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడం వీరి ప్రధాన లక్ష్యం.