
Sindhu Water: సింధు జల ఒప్పందం రద్దు.. పాకిస్తాన్లో నీటి సంక్షోభం.. మున్ముందు మరిన్ని కష్టాలు
ఈ వార్తాకథనం ఏంటి
పహలాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాకిస్థాన్ తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఈ చర్యతో దాయాది దేశంలోని జలాశయాలు అంతరించిపోయే స్థాయికి చేరుకున్నాయి.
నీటి మట్టాలు గణనీయంగా తగ్గిపోయి,వాటి నుండి నీటిని తీసుకోవడం కూడా అసాధ్యంగా మారింది.
గతేడాదితో పోలిస్తే సింధూ నది ప్రవాహ ప్రాంతంలో నీటి ప్రవాహం సుమారు 15 శాతం మేర తగ్గినట్టు రికార్డులు చెబుతున్నాయి.
ఇది రైతులకు మళ్ళీ ఒక కొత్త సంక్షోభానికి నాంది పలికే అవకాశముంది.
వేసవిలో పంటలు ఎండిపోవడం వల్ల ఇప్పటికే రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు.
ఇప్పుడు ఖరీఫ్ సీజన్లో పరిస్థితి మరింత కఠినంగా మారనుందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివరాలు
మరాలా వద్ద దిగజారుతున్న పరిస్థితి
ఉదాహరణకి, పంజాబ్ ప్రావిన్స్లో గత సంవత్సరం జూన్ 5న 1.44లక్షల క్యూసెక్కుల నీటి విడుదల జరిగినా,ఈ ఏడాది అదే తేదీన అది 1.24లక్షల క్యూసెక్కులకు పడిపోయింది.
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని టార్బెలా డ్యామ్ వద్ద ప్రస్తుతం నీటి మట్టం 1,465మీటర్లకు తగ్గింది.
ఇది కనిష్ఠ స్థాయి అయిన 1,402మీటర్ల కంటే కాస్తే ఎక్కువ. చస్మా ఆనకట్ట వద్ద నీటి మట్టం ప్రస్తుతం 644 మీటర్లుగా ఉంది,ఇది డెడ్ స్టోరేజ్ స్థాయి అయిన 638 మీటర్లకు చాలా దగ్గరగా ఉంది.
సియాల్కోట్ సమీపంలో ఉన్న మరాలా వద్ద పరిస్థితి మరింత దిగజారింది.
అక్కడ చీనాబ్ నదిలో మే 28న సగటు నీటి విడుదల 26,645 క్యూసెక్కులు కాగా,జూన్ 5న అది కేవలం 3,064 క్యూసెక్కులకు పడిపోయింది.
వివరాలు
ఖరీఫ్ పంటల భవిష్యత్తు అనిశ్చితం
ఈ నీటి కొరత కారణంగా పాక్లోని పంజాబ్ ప్రాంతంలో ఖరీఫ్ పంటల భవిష్యత్తు అనిశ్చితంగా మారింది.
భారత్ తీసుకున్న చర్యలతో మొత్తం 21 శాతం నీటి లోటు ఏర్పడనుందని పాకిస్థాన్ అంచనా వేస్తోంది.
ఉగ్రవాదంపై పాకిస్థాన్ తన వైఖరిని మార్చే వరకూ,ఈ జల ఒప్పందాన్ని పునరుద్ధరించబోమని భారత్ ఇప్పటికే తేల్చిచెప్పింది.
బలోచులపై పాక్ నిర్బంధ ఆదేశాలు..
బలోచిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న పాక్ ప్రభుత్వం ఆ నేపథ్యంలో ఇటీవల తీసుకువచ్చిన ఓ చట్టం వివాదాస్పదంగా మారుతోంది.
ఈ క్రమంలో అక్కడి అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన ఉగ్రవాద వ్యతిరేక (సవరణ)చట్టం 2025 పెద్ద దుమారాన్ని రేపుతోంది.
వివరాలు
90 రోజుల వరకు నిర్బంధించే అధికారం
ఈ చట్టంపై బలోచిస్థాన్ ప్రజలు మాత్రమే కాదు, మానవ హక్కుల సంఘాలు కూడా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ చట్టం ప్రకారం, ఎలాంటి ఆధారాలు లేకపోయినా,కేవలం అనుమానాల ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేసి,కోర్టులో హాజరుపరచకుండానే 90 రోజుల వరకు నిర్బంధించే అధికారాన్ని సైన్యం, నిఘా సంస్థలకు కల్పించారు.
అంతేకాకుండా,కోర్టుల అనుమతి లేకుండా గృహాలు,కార్యాలయాల్లో సోదాలు జరిపే హక్కును పోలీసులకు,నిఘా సంస్థలతో కూడిన సంయుక్త దర్యాప్తు బృందాలకు ఇచ్చారు.
చట్టంపై పౌర సమాజం, మానవ హక్కుల సంఘాల అభ్యంతరం కేవలం అనుమానం మీద ఆధారపడి అరెస్ట్ చేసే ఈ విధానంపై పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
వివరాలు
బలోచు ప్రజల్లో ఈ చట్టం వల్ల భయాందోళనలు
ఇది న్యాయ వ్యవస్థను అడ్డుగోలు చేసే చర్యగా భావిస్తున్న న్యాయవాదులు,హక్కుల కార్యకర్తలు, ఈ చట్టం పౌరులకు న్యాయ పరిరక్షణ లేకుండా చేస్తుందని హెచ్చరిస్తున్నారు.గతంలో నీడలో జరిగే అక్రమ నిర్బంధాలను ఇప్పుడు చట్టబద్ధంగా మార్చారని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
పాకిస్థాన్ రాజ్యాంగాన్ని అలాగే అంతర్జాతీయ చట్టాలను ఈ చట్టం ఉల్లంఘిస్తుందని మానవ హక్కుల సంస్థలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఇందులో అంనెస్టీ ఇంటర్నేషనల్,హ్యూమన్ రైట్స్ వాచ్,ఐసీసీపీఆర్ వంటి ప్రముఖసంస్థలు కూడా ఉన్నాయి.
బలోచిస్థాన్లో గతకొంతకాలంగా అదృశ్య సంఘటనలు,నిర్బంధాలు పదేపదే జరుగుతుండగా, ప్రభుత్వమే ఇందుకు కారణమనే ఆరోపణలు వచ్చాయి.
ఇప్పటికే కనిపించకుండా పోయిన తమ బంధువుల కోసం కుటుంబాలు ఏళ్ల తరబడి వెతుకుతూనే ఉన్నాయి.
ఈనేపథ్యంలో తాజాగా తీసుకొచ్చిన ఈ చట్టం బలోచు ప్రజల్లో మరింత భయాందోళనలు కలిగిస్తోంది.