Page Loader
భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో
భారతావనికి ప్రపంచం సానుభూతి

భారత్‌కు ప్రపంచ నేతల సానుభూతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పుతిన్, ఫుమియో

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jun 03, 2023
06:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒడిశాలో జరిగిన దారుణ రైలు ప్రమాదంపై అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌, జపాన్‌ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదా సహా ఐరాస జనరల్‌ అసెంబ్లీ ప్రెసిడెంట్ కోరోసి వరకు వరల్డ్ వైడ్ గా దేశాధినేతలు, ప్రముఖులు ప్రమాద మృతులకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో ఇండియాకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఒడిశాలో జరిగిన రైలు దుర్ఘటనలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా, జపాన్ దేశ ప్రభుత్వం సహా ప్రజల తరఫున సంతాపాన్ని తెలియజేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు స్పష్టం చేశారు.

Details 

ఆ బాధను మేమూ పంచుకుంటాం: రష్యా ప్రెసిడెంట్

ట్రైన్ యాక్సిడెంట్ ఘటనలో ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను మేమూ పంచుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చెప్పారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలన్నారు. ఇండియాలో జరిగిన రైలు ప్రమాద దృశ్యాలు తమను కలవరపర్చాయని, ఆప్తులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాన్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులకు అండగా ఉన్నామని కెనడియన్లు తరఫున కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో భరోసా ఇచ్చారు. ప్రమాద ఘటనలో భారీగా ప్రాణ నష్టం కలిగించిందని, ఈ దుఃఖసాగర సమయంలో ప్రధాని మోదీకి, భారత ప్రభుత్వానికి, మృతుల కుటుంబాలకు నేపాల్ తరఫున ఆ దేశ ప్రధాని పుష్పకమల్‌ దహల్ సానుభూతిని తెలియజేశారు. ఒడిశా రైలు ప్రమాదం విషాదకరమని, మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు యూఎన్‌జీఏ ప్రెసిడెంట్ కొరోసి.

Details 

ప్రతి ఒక్కరి కోసం తైవాన్ దేశం ప్రార్థిస్తోంది: సాయ్‌ ఇంగ్‌-వెన్‌ 

దుర్ఘటనలో వందలాది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. ఘటనలో బంధువులను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నానని పాక్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. ఒడిశా విషాద ఘటన దిగ్బ్రాంతికరమని, ఉక్రెయిన్ ప్రజల తరఫున ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బాధితుల కుటుంబీకులు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఐరోపా కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్‌ లెయన్‌ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రైలు దుర్ఘటనతో ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం తైవాన్ దేశం ప్రార్థిస్తోందని, బాధితులకు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నట్లు తైవాన్‌ అధ్యక్షురాలు సాయ్‌ ఇంగ్‌-వెన్‌ ప్రకటించారు.