Page Loader
సంక్షిప్తం చేయు
Missiles with Cluster Bombs: ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం.. ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులనుప్రయోగించిన ఇరాన్..!
ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం..

Missiles with Cluster Bombs: ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం.. ఇజ్రాయెల్‌పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులనుప్రయోగించిన ఇరాన్..!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇప్పటికే ఎనిమిదో రోజుకు చేరింది.

ఈ రెండు దేశాల పరస్పర దాడుల ప్రభావంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధ రంగంగా మారిపోయింది.

ఇరాన్ తమపై దాడికి క్లస్టర్ బాంబులను వినియోగించిందని టెల్‌అవీవ్ సైన్యం ఆరోపించింది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టెహ్రాన్ ఈ తరహా బాంబులను ఇదే మొదటిసారిగా ఉపయోగించిందని వారు పేర్కొన్నారు.

ఈ క్లస్టర్ బాంబు క్షిపణుల తల భాగం(వార్హెడ్)సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోగా,అది 20 చిన్న తరహా పేలుడు పదార్థాలుగా విడిపోయి విస్తృత ప్రాంతాల్లో దాడులు జరిపిందని ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది.

వివరాలు 

ఆసుపత్రిపై క్షిపణి దాడి.. 230 మంది పౌరులకు గాయాలు 

సాధారణ బాలిస్టిక్ క్షిపణులతో పోల్చితే ఈ క్లస్టర్ బాంబులు మరింత వినాశనాన్ని కలిగించే సామర్థ్యం కలిగి ఉంటాయని టెల్‌అవీవ్‌కి చెందిన ఓ ఉన్నతాధికారి వివరించారు.

గురువారం ఇజ్రాయెల్‌లోని దక్షిణ ప్రాంతమైన బీర్‌షెబాలో ఉన్న ఓ ఆసుపత్రిపై క్షిపణి దాడి జరిగింది.

ఇది క్లస్టర్ బాంబుతో జరిపిన దాడేనని టెల్‌అవీవ్ సైనిక విభాగం స్పష్టం చేసింది.

ఆసుపత్రితో పాటు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలు కూడా ఈ దాడిలో లక్ష్యంగా మారినట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో సుమారు 230 మంది పౌరులు గాయపడ్డారు.

వివరాలు 

ఇరాన్‌లో కొత్త రివల్యూషనరీ గార్డ్ అధికారి నియామకం 

ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పటికే ఘాటుగా స్పందించింది.

పౌరుల ప్రాణాలను లక్ష్యంగా చేసుకున్న టెహ్రాన్‌ తగిన మూల్యం చెల్లించక తప్పదని గట్టిగా హెచ్చరించింది.

తమ ప్రజలపై జరిగిన ఈ దాడులకు తగిన ప్రతీకారం తప్పక తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల కారణంగా ఇరాన్‌లో అనేక కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ నేపథ్యంలో టెహ్రాన్ ప్రభుత్వం తక్షణమే తగిన భర్తీ చర్యలు చేపట్టింది.

అందులో భాగంగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌ (IRGC) ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త చీఫ్‌ను నియమించింది.

మాజిద్ ఖాదేమి అనే అధికారిని ఈ కీలక పదవిలో నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది.