
Missiles with Cluster Bombs: ఎనిమిదో రోజుకు చేరిన యుద్ధం.. ఇజ్రాయెల్పై క్లస్టర్ బాంబులతో కూడిన క్షిపణులనుప్రయోగించిన ఇరాన్..!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇప్పటికే ఎనిమిదో రోజుకు చేరింది.
ఈ రెండు దేశాల పరస్పర దాడుల ప్రభావంతో పశ్చిమాసియా మొత్తం యుద్ధ రంగంగా మారిపోయింది.
ఇరాన్ తమపై దాడికి క్లస్టర్ బాంబులను వినియోగించిందని టెల్అవీవ్ సైన్యం ఆరోపించింది.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టెహ్రాన్ ఈ తరహా బాంబులను ఇదే మొదటిసారిగా ఉపయోగించిందని వారు పేర్కొన్నారు.
ఈ క్లస్టర్ బాంబు క్షిపణుల తల భాగం(వార్హెడ్)సుమారు 7 కిలోమీటర్ల ఎత్తులో పేలిపోగా,అది 20 చిన్న తరహా పేలుడు పదార్థాలుగా విడిపోయి విస్తృత ప్రాంతాల్లో దాడులు జరిపిందని ఇజ్రాయెల్ హోమ్ ఫ్రంట్ కమాండ్ తెలిపింది.
వివరాలు
ఆసుపత్రిపై క్షిపణి దాడి.. 230 మంది పౌరులకు గాయాలు
సాధారణ బాలిస్టిక్ క్షిపణులతో పోల్చితే ఈ క్లస్టర్ బాంబులు మరింత వినాశనాన్ని కలిగించే సామర్థ్యం కలిగి ఉంటాయని టెల్అవీవ్కి చెందిన ఓ ఉన్నతాధికారి వివరించారు.
గురువారం ఇజ్రాయెల్లోని దక్షిణ ప్రాంతమైన బీర్షెబాలో ఉన్న ఓ ఆసుపత్రిపై క్షిపణి దాడి జరిగింది.
ఇది క్లస్టర్ బాంబుతో జరిపిన దాడేనని టెల్అవీవ్ సైనిక విభాగం స్పష్టం చేసింది.
ఆసుపత్రితో పాటు పక్కనే ఉన్న నివాస ప్రాంతాలు కూడా ఈ దాడిలో లక్ష్యంగా మారినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో సుమారు 230 మంది పౌరులు గాయపడ్డారు.
వివరాలు
ఇరాన్లో కొత్త రివల్యూషనరీ గార్డ్ అధికారి నియామకం
ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇప్పటికే ఘాటుగా స్పందించింది.
పౌరుల ప్రాణాలను లక్ష్యంగా చేసుకున్న టెహ్రాన్ తగిన మూల్యం చెల్లించక తప్పదని గట్టిగా హెచ్చరించింది.
తమ ప్రజలపై జరిగిన ఈ దాడులకు తగిన ప్రతీకారం తప్పక తీసుకుంటామని స్పష్టం చేసింది.
ఇజ్రాయెల్ ఇటీవల జరిపిన దాడుల కారణంగా ఇరాన్లో అనేక కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో టెహ్రాన్ ప్రభుత్వం తక్షణమే తగిన భర్తీ చర్యలు చేపట్టింది.
అందులో భాగంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఇంటెలిజెన్స్ విభాగానికి కొత్త చీఫ్ను నియమించింది.
మాజిద్ ఖాదేమి అనే అధికారిని ఈ కీలక పదవిలో నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది.