
Operation Sindhu: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం: 'ఆపరేషన్ సింధు'తో పెద్ద మనసు చాటుకున్న భారత్
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో పశ్చిమాసియా రణరంగంగా మారింది. ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం 'ఆపరేషన్ సింధు' చేపట్టి అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది. అదే సమయంలో భారత్ తన గొప్ప మనసును చాటుతూ, పొరుగుదేశాలైన నేపాల్, శ్రీలంకలకు చెందిన విద్యార్థులను కూడా తరలిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో, తమ విద్యార్థులను కూడా రక్షించాలని నేపాల్, శ్రీలంక దేశాలు భారత్ సహాయం కోరాయి. దీని నేపథ్యంలో 'ఆపరేషన్ సింధు'లో భాగంగా ఈ రెండు దేశాల విద్యార్థులను కూడా ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి రప్పించాలని భారత్ నిర్ణయించింది. టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం దీనిపై ఓ ప్రకటన విడుదల చేసింది.
Details
ఇరాన్ నుంచి భారతీయ విద్యార్థుల రాక
ఈక్రమంలో భారత విదేశాంగశాఖ శనివారం ప్రకటించిన వివరాల ప్రకారం, 'ఆపరేషన్ సింధు'లో ఇప్పటివరకు 517 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ప్రత్యేక విమానంలో ఇరాన్ నుంచి 290 మంది భారతీయ విద్యార్థులు, యాత్రికులు దిల్లీకి చేరుకున్నారు. అంతకుముందే 110 మంది విద్యార్థులను భారత్ స్వదేశానికి రప్పించింది. ఇక ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతుండటంతో భారత్ అక్కడ ఉన్న భారతీయులను రప్పించేందుకు చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసినప్పటికీ, భారత్ కోసం ప్రత్యేక మినహాయింపును ఇచ్చింది. మొత్తం 3 విమానాల ద్వారా దాదాపు1000 మంది విద్యార్థులను స్వదేశానికి రప్పించే ప్రయత్నంలో భారత్ ఉంది. ఇప్పటికే 517 మంది వచ్చారు, మిగతావారిని కూడా రప్పించేందుకు కేంద్రం కృషిచేస్తోంది.