
Iran: ఐఏఈఏకు 'నో' చెప్పిన ఇరాన్.. అణు కేంద్రాలపై కీలక నిర్ణయం!
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన 24 గంటల్లోనే ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ)కు ఇకపై ఏమాత్రం సహకరించకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయానికి ఇరాన్ పార్లమెంట్ అనుకూలంగా ఓటు వేసింది. త్వరలోనే దేశ సుప్రీం నేషనల్ కౌన్సిల్ దీనికి తుది ఆమోదం తెలపనుంది. ఇరాన్ అణుకేంద్రాలపై జరిగిన దాడులను ఖండించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ నిరాకరించడం విశ్వసనీయతను వేలానికి పెట్టినట్లే" అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలిబాఫ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఇరాన్ అణుకేంద్రాల భద్రతకు ఐఏఈఏ హామీ ఇచ్చే వరకు ఆ సంస్థతో అన్ని రకాల సహకారాన్ని నిలిపివేయాలని పార్లమెంట్ తీర్మానించింది.
Details
ఎంతవరకూ దెబ్బతిన్నాయో స్పష్టత రాలేదు
తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరగడాన్ని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్వాగతించింది. యుద్ధం కొనసాగినంత కాలం ఐఏఈఏ ఇన్స్పెక్టర్లు ఇరాన్ లోనే ఉన్నారు. ఈ నెల 22వ తేదీ తెల్లవారుజామున అమెరికా బాంబర్ విమానాలు ఇరాన్లోని నతాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ అణుకేంద్రాలపై భారీ స్థాయిలో దాడులకు పాల్పడ్డాయి. ఈక్రమంలో అమెరికా 'బంకర్ బస్టర్' బాంబులను ఉపయోగించింది. ఈ దాడుల కారణంగా ఆ కేంద్రాలు ఎంతవరకూ దెబ్బతిన్నాయో స్పష్టత రాలేదు. కొంతమంది అమెరికా పత్రికలు మాత్రం ఫోర్డో కేంద్రం స్వల్పంగానే దెబ్బతిన్నట్లు తెలిపాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ, ఇరాన్ పై జరిగిన దాడి చెప్పుకోదగిన స్థాయిలో నష్టం కలిగించిందని, దీంతో ఆ దేశ అణుకార్యక్రమం ఎంతో వెనుకకుపోయినట్లు తెలిపారు.