
Pak ISI Chief: భారతదేశం-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య.. ISI చీఫ్ మహ్మద్ అసిమ్ మాలిక్ కు కీలక బాధ్యతలు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ సైన్యంలో కీలక మార్పు చోటుచేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ అసిమ్ మాలిక్ను, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారుగా (ఎన్ఎస్ఏ) నియమించినట్టు పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా నివేదికలు వెలుగులోకి తెచ్చాయి. 2024 సెప్టెంబరులో ఐఎస్ఐ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ జనరల్ అసిమ్ మాలిక్కు, ఇప్పుడు ఎన్ఎస్ఏగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించినట్టు ఈ కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
వివరాలు
భారత్ ఎప్పుడైనా తమపై దాడికి దిగొచ్చని..
ఇక పహల్గాం ఉగ్రదాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు ప్రతిస్పందనగా భారత్ పాకిస్తాన్పై ఒత్తిడి పెంచే విధంగా సామ, దాన, భేద, దండోపాయలను ఉపయోగిస్తోంది. ఈ పరిణామాలతో పాక్ సైన్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. భారత్ ఎప్పుడైనా తమపై దాడికి దిగొచ్చని, పాకిస్తాన్ మంత్రులు బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఇదే సమయంలో, ఆ దేశ సైన్యాధిపతి జనరల్ సయీద్ అసిమ్ మునీర్ ఆచూకీ కనిపించకుండా పోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ ప్రతీకార దాడుల భయంతో ఆయన కుటుంబంతో కలసి పరాయి దేశానికి వెళ్లిపోయినట్టు సమాచారం.
వివరాలు
రెండు రోజుల వ్యవధిలో 4,500 మంది సైనికులు, 250 మంది అధికారులు
పహల్గాం దాడికి తర్వాత పాకిస్తాన్ అంతటా రాజకీయ, సైనిక స్థాయిలో తీవ్ర పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ భయాల నేపథ్యంలో, సైన్యంలో భయభ్రాంతులు మరింతగా పెరిగాయి. ఈ క్రమంలో, "బతికితే బలుసాకు తిని బతకవచ్చు కానీ భారత్తో యుద్ధం చేయలేం" అనే భావనను ప్రతిబింబించేలా రెండు రోజుల వ్యవధిలో 4,500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా, అసిమ్ మాలిక్కు జాతీయ భద్రతా సలహాదారుగా అదనపు బాధ్యతలు అప్పగించడం విశేషంగా చెబుతున్నాయి.