
Ayatollah Ali Khamenei : ఎట్టకేలకు బాహ్యప్రపంచంలోకి ఖమేనీ.. అషురా వేడుకులకు హాజరు
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్తో తలెత్తిన యుద్ధం అనంతరం, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బహిరంగంగా దర్శనమిచ్చారు. రాజధాని టెహ్రాన్లో నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ద్వారా, ఆయన ఆరోగ్యం, పరిస్థితులపై వచ్చిన అనేక ఊహాగానాలకు చెక్ పడింది. షియా ముస్లిం క్యాలెండర్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అషురా (మొహర్రం) పర్వదినాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమంలో ఖమేనీ పాల్గొనడం గమనార్హం. ఇరాన్ స్టేట్ టీవీ ద్వారా ప్రసారమైన వీడియోలో, సాంప్రదాయ నల్లని వస్త్రాలలో, ప్రజల హర్షధ్వానాల మధ్య ఖమేనీ ప్రవేశించి, అందరినీ అభివాదంతో పలకరించిన దృశ్యాలు కనిపించాయి.
Details
యుద్ధం తర్వాత ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి
ప్రతి ఏడాది ఖమేనీ అషురా సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనవాయితీగా ఉండగా, ఈసారి మాత్రం ఆయన హాజరు ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరిగిన 12 రోజుల యుద్ధం (జూన్ 24న ముగిసింది) అనంతరం ఆయన ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి కావడంతో ఈ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యం చేకూరింది. యుద్ధం సమయంలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఖమేనీ తన కుటుంబంతో కలిసి అత్యంత సురక్షితమైన బంకర్లో ఆశ్రయం తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి.
Details
అనుమానాలకు చెక్ పెట్టిన ఖమేనీ
అయితే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం వల్ల ప్రజలలో, రాజకీయవర్గాలలో అనేక అనుమానాలేర్పడ్డాయి. 'ఖమేనీ ఎక్కడ?' అనే ప్రశ్న సోషల్మీడియా వేదికలపై విస్తృతంగా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో, టెహ్రాన్లోని కార్యక్రమంలో పాల్గొన్న ఖమేనీ వీడియో ద్వారా ప్రజలకే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా సాక్షాత్కారమిచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా తాను సురక్షితంగా ఉన్నానని, దేశానికి అండగా నిలిచే నాయకత్వం ఇంకా క్రియాశీలంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.