
IDF: ఇజ్రాయెల్ మిస్సైల్ దాడిలో ఖమేనీ సన్నిహిత సైనిక సలహాదారు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
ఇజ్రాయెల్-ఇరాన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో యుద్ధం ఐదో రోజు కూడా కొనసాగుతోంది.
ఈ క్రమంలో టెల్అవీవ్ తాజాగా టెహ్రాన్ నగరంపై నిర్వహించిన మిస్సైల్ దాడుల్లో, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei)కు అత్యంత సమీపంగా ఉన్న సైనిక సలహాదారు అలీ షాద్మానీ (Ali Shadmani) మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైనిక అధికారులు ప్రకటించారు.
టెహ్రాన్ సెంట్రల్లో ఆయన తలదాచుకున్న ప్రాంతంపై ఖచ్చితమైన నిఘా ఆధారంగా ఈ దాడి జరిపామని తెలిపారు.
అలీ షాద్మానీ గతంలో అల్-అన్బియా అత్యవసర కమాండ్ సెంటర్లో డిప్యూటీ కమాండర్గా, అలాగే ఇరాన్ సాయుధ దళాల జనరల్ స్టాఫ్ ఫోరమ్ ఆపరేషన్స్ డైరెక్టరేట్ అధిపతిగా కీలక పదవుల్లో సేవలందించారు.
Details
క్షిపణి దాడులకు ప్రణాళిక
ఈయనే ఇటీవలి కాలంలో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్పై జరిగిన క్షిపణి దాడులకు ప్రణాళిక రచించినట్టు ఐడీఎఫ్ (Israel Defense Forces) పేర్కొంది.
ఇదిలా ఉండగా, ఇరాన్ కూడా ప్రతిదాడులకు పాల్పడుతోంది. మంగళవారం సాయంత్రం దాదాపు 20 బాలిస్టిక్ క్షిపణులు టెల్అవీవ్ నగరంపై ప్రయోగించినట్లు సమాచారం.
ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమయ్యాయి, వాహనాలు దగ్ధమయ్యాయని, భారీగా మంటలు చెలరేగినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
Details
ఇజ్రాయెల్ దాడుల్లో కీలక నేతలు మృతి
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు ఇరాన్కు చెందిన అనేక కీలక సైనిక నేతలు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జనరల్ స్టాఫ్ నిఘా డిప్యూటీ జనరల్ ఘోలామ్రేజా మెహ్రాబీ, ఆపరేషన్ డిప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీ, ఐఆర్జీసీ చీఫ్ మేజర్ జనరల్ హొస్సేన్ సలామీ, సైనిక పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాఘేరి, క్షిపణి శాఖ అధిపతి జనరల్ అమీర్అలీ హాజీజదే, పలువురు అణు శాస్త్రవేత్తలు ఉన్నారు.
ఈ యుద్ధంపై సోమవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీని హతమార్చినప్పుడే ఈ యుద్ధం ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రకటన నేపథ్యంలో, ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్లోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని మరిన్ని దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది