మోదీజీ, యుద్ధాన్ని ముగించే శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపండి; జెలెన్స్కీ అభ్యర్థన
ఉక్రెయిన్-రష్యా యుద్ధం గత 15నెలలుగా భీకరంగా సాగుతోంది. అయితే ఈ యుద్ధాన్ని ముగించేందుకు అండగా నిలబడాలని, తమ శాంతి ప్రతిపాదనకు మద్దతు తెలపాలని ప్రధాని మోదీని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థించారు. హిరోషిమాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో శాంతి ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాని నరేంద్ర మోదీకి అందించారు. అత్యంత విశ్వసనీయమైన దేశం అయినందున వల్లే భారతదేశం ఆమోదాన్ని జెలెన్స్కీ కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు మోదీ అంటే జెలెన్స్కీకి చాలా అభిమానం.
ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్న భారత్
ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వైపు చాలా దేశాలు చూస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ యవనికపై భారత్ ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు సహకరించాలని మోదీని జెలెన్స్కీ కోరారు. అయితే ఉక్రెయిన్ శాంతి ప్రతిపాదనను మోదీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో గతేడాది మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల కాలం కాదని చెప్పి ప్రపంచ దేశాల దృష్టిని మోదీ ఆకర్షించారు. ఈ క్రమంలో మోదీ పట్ల జెలెన్స్కీ అభిమానం విపరీతంగా పెరిగింది.