
Russia: రిక్ ఫార్మాట్ను పునరుద్ధరించాల్సిన సమయం ఆసన్నమైంది: సెర్గీ లావ్రోవ్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా, భారత్, చైనా కలిసి ఏర్పాటు చేసుకున్న రిక్ (RIC) ఫార్మాట్ను తిరిగి చురుగ్గా కొనసాగించాలన్న ఆసక్తి తమకు ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ స్పష్టం చేశారు.
గురువారం ఉరాల్ పర్వతాల సమీపంలోని పెర్మ్ నగరంలో భద్రత,అంతర్జాతీయ సహకారంపై జరిగిన సామాజిక-రాజకీయ సమావేశంలో లావ్రోవ్ప్రసంగించారు.
ఈ సందర్భంలో భారత్, చైనా, రష్యాల మధ్య ఉన్న భాగస్వామ్యంపై ఆయన వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
మూడు దేశాల మధ్య 20కు పైగా సమావేశాలు
లావ్రోవ్ మాట్లాడుతూ, ''రష్యా మాజీ ప్రధాని యెవ్గెని ప్రైమకోవ్ స్వచ్ఛందంగా తీసుకున్న ముందడుగు ఫలితంగా చాలా ఏళ్ల క్రితం రిక్ (Russia-India-China) ఫార్మాట్ ఏర్పడింది. అప్పటినుంచి ఇప్పటి వరకు ఈ మూడు దేశాల మధ్య 20కు పైగా సమావేశాలు జరిగాయి. ఈ చర్చలు కేవలం విదేశాంగ మంత్రిత్వ శాఖల స్థాయిలో కాకుండా, ఆర్థిక, వాణిజ్య రంగాలకు చెందిన సంస్థల ప్రధానులతో కూడినవిగా కూడా కొనసాగాయి. ప్రస్తుతం భారత్, చైనా మధ్య సరిహద్దు సమస్యలపై కొంత అవగాహన ఏర్పడిన నేపథ్యంలో, రిక్ ఫార్మాట్ను తిరిగి క్రియాశీలం చేయడానికి ఇదే సరైన సమయంగా అనిపిస్తోంది,'' అని అన్నారు.
వివరాలు
చైనాను ఎదుర్కొనేందుకు భారత్ను ప్రేరేపించే దిశగా నాటో ప్రయత్నం
ఈ సందర్భంగా లావ్రోవ్ నాటో (NATO) దేశాలపై విమర్శలు గుప్పించారు.
చైనాను ఎదుర్కొనేందుకు భారత్ను ప్రేరేపించే దిశగా నాటో ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
ఇది భారత్-చైనా మధ్య విభేదాలను రెచ్చగొట్టే పద్ధతిగా భావించవచ్చని వ్యాఖ్యానించారు.
ఇక గత ఏడాది రష్యాలో నిర్వహించిన బ్రిక్స్ (BRICS) సమావేశాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే.
ఆ సమావేశంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, బలగాలను వెనక్కు తీసుకోవాలన్న విషయంలో ఇరుదేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.
ఈ చర్చల అనంతరం భారత్-చైనా మధ్య సంబంధాలు కొంతవరకూ మెరుగయ్యాయి.