
Nepal Political Turmoil: రాజకీయ సంక్షోభంలో నేపాల్.. కేబినెట్ మంత్రులు రాజీనామా.. దుబాయ్కి ప్రధాని ఓలి
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్లో ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించడాన్ని నిరసిస్తూ ఆ దేశ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మక స్థాయికి చేరింది. వేలాది మంది జెనరేషన్ జెడ్ యువకులు సోమవారం కాఠ్మాండులో జరిగిన ప్రదర్శనలో భాగంగా పెద్ద ఎత్తున రణరంగం సృష్టించారు. ఈ నిరసనల్లో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయారు, అలాగే 300 మందికి పైగా వ్యక్తులు గాయపడ్డారు. యువత హింసాత్మక నిరసనల ప్రభావంతో, నేపాల్ ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై తీసుకున్న నిషేధ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఫేస్బుక్, ట్విటర్, వాట్సాప్ సహా 26 సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై ఈ నెల 4న విధించిన నిషేధం ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది.
వివరాలు
రాజకీయ సంక్షోభం..?
అయినప్పటికీ నిరసనలు చల్లారట్లేదు. మరోవైపు రాజధాని సహా పలు ప్రధాన నగరాల్లో సైన్యం మోహరించింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో, నేపాల్లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ దేశ ప్రధాని కేపీ ఓలి (KP Oli) రాజకీయ సంక్షోభంలో ఇరుక్కున్నారు ఇప్పటికే పలువురుకేబినెట్ మంత్రులు తమ పదవుల నుండి రాజీనామా చేశారు. ముఖ్యంగా, హోంమంత్రి రమేష్ లేఖక్ తన పదవికి అధికారికంగా రాజీనామా చేసారు. కేబినెట్ సమావేశంలో ఆయన రాజీనామాను ప్రధాని ఓలికి సమర్పించారు. అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి రామ్నాథ్ అధికారి, ఆరోగ్య శాఖ మంత్రి ప్రదీప్ పౌడేల్ కూడా తమ పదవులను వీడారు. ఈ పరిణామాల కారణంగా నేపాల్లో రాజకీయ సంక్షోభం నెలకొనే పరిస్థితి తలెత్తింది.
వివరాలు
దుబాయ్కి వెళ్లే ప్రయత్నంలో ప్రధాని ఓలి
తాజా పరిస్థితుల నేపథ్యంలో, నేపాల్ ప్రధాని కేపీ ఓలి దేశం విడిచి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఆయన దుబాయ్ (Dubai)కు వెళ్లడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. ఈ ప్రయాణం హిమాలయ ఎయిర్లైన్స్కు చెందిన ప్రైవేట్ ఫ్లైట్ ద్వారా జరుగుతుందని తెలిపింది. ప్రధాని ఓలి ఇప్పటికే ఉప ప్రధాన మంత్రికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు కూడా మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఓలి వైద్య చికిత్స కోసం మాత్రమే దుబాయ్ వెళ్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.