Page Loader
POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం 
రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం

POK: రెండు నెలల ఆహారం నిల్వచేసుకోండి.. స్థానికులను అప్రమత్తం చేసిన పీఓకే యంత్రాంగం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 02, 2025
05:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాంలో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను (పీఓకే) భారత్‌ తన ఆధీనంలోకి తీసుకోవాలని అంతర్జాతీయ వేదికల నుంచి సూచనలు వస్తున్నాయి. ఈ తరుణంలో పీఓకేలోని ప్రజలను ఆహార నిల్వల కోసం అప్రమత్తం చేయడం అక్కడి యంత్రాంగం చేపట్టిన చర్యగా కనిపిస్తోంది. పీఓకేలోని 13 నియోజకవర్గాల్లో నివసించే ప్రజలు కనీసం రెండు నెలల పాటు అవసరమైన ఆహార సరుకులను నిల్వ చేసుకోవాలని తమ ప్రభుత్వం సూచించిందని,చౌధరీ అన్వర్ ఉల్ హక్ పీఓకే అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. దీనితోపాటు,అత్యవసర అవసరాలకు రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

వివరాలు 

పీఓకే అభివృద్ధిపై తక్కువ ఆసక్తి 

ఆహార సరఫరా, ఔషధాలు, ఇతర అవసరాలపై ఎటువంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ఈ నిధిని వినియోగించనున్నట్లు చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన కొద్దికాలానికే పాకిస్థాన్‌ పీఓకేను ఆక్రమించినప్పటికీ, ఆ ప్రాంత అభివృద్ధిపై తక్కువ ఆసక్తి చూపింది. పీఓకేను ఇండియాపై వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా వాడుతున్న పాక్‌ పాలకులు, ఆ ప్రాంత ప్రధానమంత్రులను ఇస్లామాబాద్‌కు మాత్రమే విధేయులుగా ఉంచుతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ కరవవుతోంది. పాకిస్థాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాట్లు, ఉగ్రదాడులు ఆ ప్రాంతాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పీఓకేలో భారత అనుకూల శబ్దాలు వినిపించడం ప్రారంభమైంది.

వివరాలు 

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌ స్వాధీనం చేసుకోవాలి: బ్రిటన్‌ ఎంపీ 

ఇందుకోసమే ఇటీవల బ్రిటన్‌కు చెందిన భారత సంతతికి చెందిన ఎంపీ లార్డ్ మేఘనాథ్ మాట్లాడుతూ.. కశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌ స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇది మాత్రమే అన్ని సమస్యలకు తుది పరిష్కారమని స్పష్టంచేశారు. ఉగ్రవాదులను దుర్భరంగా శిక్షించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే భారత్‌ గట్టి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దాడి అమానుషంగా ఉందని తీవ్రంగా ఖండించారు. కశ్మీర్ వివాదానికి ఇది చివరి ఘట్టంగా మిగలాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దీటైన నిర్ణయాలు తీసుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తంచేశారు.