Page Loader
China: చైనాలో ఖనిజాలపై ఆంక్షలు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాలపై ప్రభావం!
చైనాలో ఖనిజాలపై ఆంక్షలు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాలపై ప్రభావం!

China: చైనాలో ఖనిజాలపై ఆంక్షలు.. స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాలపై ప్రభావం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులపై విధించిన ఆంక్షల కారణంగా భారత స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, ఆడియో పరికరాల తయారీ రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోందని పరిశ్రమ నిపుణులు తెలిపారు. సరఫరా అంతరాయం, ముడి సరుకుల ధరల పెరుగుదల, పరికరాల నాణ్యతపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని మనీ కంట్రోల్‌ కు నిపుణులు వివరించారు.

Details

15 వేల పరోక్ష ఉద్యోగాలపై ప్రభావం 

చైనా ఆంక్షలు ఇప్పటికే భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న 'హియరేబుల్స్', 'వేరేబుల్స్' మార్కెట్లపై ప్రభావం చూపించడం ప్రారంభించాయి. పలువురు తయారీదారులు పూర్తి అసెంబుల్‌ అయిన స్పీకర్‌ మాడ్యూళ్లు చైనా నుంచే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇండియా ఎలక్ట్రానిక్స్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ (ELCINA) అంచనా ప్రకారం, నోయిడా, దక్షిణ భారతదేశంలోని స్పీకర్‌, ఆడియో భాగాల తయారీలో నేరుగా 5-6 వేల ఉద్యోగాలు, పరోక్షంగా 15 వేల ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని హెచ్చరించింది.

Details

నియోడియం-ఇనుము-బోరాన్‌ మాగ్నెట్లపై ఆధారపడిన పరిశ్రమ 

చైనా ఏప్రిల్‌ లో ఏడు రకాల అరుదైన ఖనిజాలపై ముఖ్యంగా టెర్బియం, డిస్ప్రోసియం ఎగుమతులపై కఠిన లైసెన్సింగ్‌ నిబంధనలు అమలు చేసింది. నీయోడియం-ఇనుము-బోరాన్‌ (NdFeB) మాగ్నెట్లు, ఆధునిక కన్స్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ లో ముఖ్య భాగం. ఇవే టీవీలు, టిడబ్ల్యూఎస్‌ ఇయర్‌బడ్స్‌, మైక్రోఫోన్లు, హాప్టిక్‌ మోటార్లు, కెమెరా మాడ్యూళ్ల వంటి పరికరాలకు శక్తినిస్తాయి. చిన్న పరిమాణంలో ఉన్నా శక్తివంతమైన ఈ మాగ్నెట్లు ప్రస్తుత టీవీలు, ఇయర్‌బడ్‌ల డిజైన్‌ ను సన్నగా, తేలికగా, శక్తివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Details

దేశీయ ఉత్పత్తిని పెంపొందించడం అత్యవసరం 

స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించే మాగ్నెట్ల పరిమాణం తక్కువే అయినా, విస్తృత ఉత్పత్తి కారణంగా చిన్న అంతరాయం కూడా పరిశ్రమపై భారీ ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉంది. రాబోయే కాలంలో భారతదేశం ఈ అరుదైన ఖనిజాల ప్రత్యామ్నాయ సరఫరా వనరులను అభివృద్ధి చేయడం, దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడం, రీసైక్లింగ్‌ సామర్థ్యాన్ని పెంపొందించడం ఎంతో అవసరమని నిపుణులు అభిప్రాయపడ్డారు.