
Austria: ఆస్ట్రియాలోని పాఠశాలలో కాల్పులు కలకలం.. 11మంది మృతి!
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రియాలోని ఒక పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది.
గ్రాజ్ నగరంలో ఉన్న ఓ విద్యాసంస్థలో మంగళవారం ఉదయం ఒక విద్యార్థి అకస్మాత్తుగా లోపలికి ప్రవేశించి రెండు తరగతులపై విచక్షణ లేకుండా కాల్పులు ప్రారంభించాడు.
ఈ దుర్మార్గ ఘటనలో 11 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
వీరిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. అదనంగా 30 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.
కాల్పులను ఆపేందుకు ప్రయత్నించిన మహిళ ఉపాధ్యాయురాలిపై దుండగుడు అనేకసారి కాల్పులు జరిపినట్లు సమాచారం.
దీంతో ఆమె తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు.
వివరాలు
2015 జూన్లో కూడా ఇలాంటి ఘోర ఘటన
ఈ దాడికి పాల్పడిన విద్యార్థి అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
అతని శవాన్ని పాఠశాల బాత్రూంలో గుర్తించినట్టు సమాచారం. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
ఏవైనా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పాఠశాల పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు.
ఇదే గ్రాజ్ ప్రాంతంలో 2015 జూన్లో కూడా ఇలాంటి ఘోర ఘటన చోటుచేసుకుంది.
అప్పట్లో ముగ్గురు వ్యక్తులు కాల్పుల్లో మృతిచెందారు. ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఘటన జరిగి దాదాపు పదేళ్లు పూర్తవుతుండటంతో, గత సంఘటనకు గుర్తుగా విద్యార్థి ఈ కాల్పులకు పాల్పడ్డ ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.