ఇమ్రాన్ ఖాన్ను ఏ జైలుకు పంపారు? ఎలాంటి సౌకర్యాలు కల్పించారంటే?
తోషాఖానా కేసులో అరెస్టయిన పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ జైలుకు తరలించారు. అక్కడ ఇమ్రాన్ కు భారీ భద్రత కల్పించారు. ఇమ్రాన్ ను అన్ని సౌకర్యాలతో కూడిన అడియాలా జైలులో ఉంచుతారని అంతా భావించారు. కానీ అందరి ఊహాగానాలు తలకిందులవుతూ ఎలాంటి వీవీఐపీ సౌకర్యాలు లేని అటాక్ జైలుకు తరలించారు. ఈ జైలులో ఏ,బీ కేటగిరీ బ్యారక్లు లేవు. ఉక్కడ ఉన్నది 'సి' కేటగిరీ బ్యారక్లు మాత్రమే. అయితే ఇమ్రాన్ ఖాన్ కోసం ప్రత్యేకం బీ కేటగిరి బ్యారక్ సిద్ధం చేసినట్లు పాక్ మీడియా సంస్థ 'డాన్' పేర్కొంది. అంతేకాదు ఇమ్రాన్ఖాన్ను కలిసేందుకు న్యాయవాదులు, పార్టీ నేతలను జైలు అధికారులు అనుమతించడం లేదు.
అటాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మొదటి మాజీ ప్రధాని
ఇమ్రాన్ ఖాన్ ఉన్న అటాక్ జైలులో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. శనివారం జైలుకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ ఆ రాత్రంతా ఉక్కపోతలో ఫ్యాన్ కింద పడుకోవాల్సి వచ్చింది. ఈ జైలులో విద్యుత్ సమస్య తరుచూ వస్తూ ఉంటుంది. తొలిరోజు రాత్రి ఆయన కొద్దిసేపు దీపం వెలుగులోనే ఉండాల్సి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అటాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మొదటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కావడం గమనార్హం. ఇమ్రాన్ఖాన్కు పుస్తకాలు, వార్తాపత్రికలు, టీవీ, జైలు ఆహారం ఇస్తున్నారని యంత్రాంగం పేర్కొంది. ఇమ్రాన్ బ్యారక్లో బాత్రూమ్ ఉండడం కాస్త ఊరటనిచ్చే అంశం.
పాకిస్థాన్లో హై అలర్ట్
ఇమ్రాన్ ఖాన్ అరెస్టు నేపథ్యంలో పాకిస్థాన్లో హై సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించారు. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనల వెల్లువెత్తున్న నేపథ్యంలో ఇస్లామాబాద్, రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయానికి భారీ భద్రత కల్పించారు. ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా శాంతియుత ప్రదర్శనలకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిలుపునిచ్చింది. దేశంలో పెద్ద సంఖ్యలో పాకిస్థానీయులు వీధుల్లోకి వచ్చి ఇమ్రాన్ ఖాన్కు మద్దతు తెలిపారు. తోషాఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్కు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఇస్లామాబాద్లోని సెషన్స్ కోర్టు శనివారం తీర్పు చెప్పింది. అనంతరం లాహోర్లోని జమాన్ పార్క్లో ఇమ్రాన్ను అరెస్టు చేశారు.