
Pakistan: బలూచిస్తాన్లో మస్తుంగ్లో బాంబు పేలుడు.. రైలులో 350 మంది ప్రయాణికులు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం |
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ బలూచిస్తాన్లోని మస్తుంగ్ జిల్లాలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు కారణంగా ఈ ఘటన జరిగింది.అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం డాన్ పత్రిక తెలిపింది. "రైల్వే ట్రాక్కు అమర్చిన బాంబు పేలింది. దీంతో జాఫర్ ఎక్స్ప్రెస్కి చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. కానీ ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు," అని పాకిస్తాన్ రైల్వేస్ క్వెట్టా డివిజన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి మహ్మద్ కాషిఫ్ Dawn.comకి చెప్పారు.
వివరాలు
రైలులో 350 మంది ప్రయాణికులు
మస్తుంగ్ జిల్లా దష్ట్ తహసీల్లోని స్పెజాండ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. క్వెట్టా నుంచి పేషావర్ సిటీ స్టేషన్ వైపు వెళ్తున్న రైలులో 350 మంది ప్రయాణికులు ఉన్నారు. "ఘటన గురించి సమాచారం అందిన వెంటనే భద్రతా బలగాలు, రక్షణ బృందాలు అక్కడికి చేరుకుని, ప్రాంతాన్ని ముట్టడి చేసి శోధన చర్యలు ప్రారంభించాయి," అని కాషిఫ్ డాన్ కి వివరించారు. అలాగే, "జాఫర్ ఎక్స్ప్రెస్కి చెందిన నాలుగు బోగీలు తిరిగి పట్టాలపై అమర్చాం. మిగతా రెండు బోగీలను కూడా పునరుద్ధరించడానికి పనులు కొనసాగుతున్నాయి" అని ఆయన తెలిపారు.
వివరాలు
రైల్వే ట్రాక్ పక్కన అమర్చిన బాంబు
350మంది ప్రయాణికులను క్వెట్టాకు తిరిగి తరలించారు.ఈఘటన తరువాత పాకిస్తాన్ రైల్వేస్ ఒక సహాయ రైలు నడిపి అందరినీ క్వెట్టాకు తీసుకువచ్చింది. ట్రాక్పై ఇరుక్కుపోయిన బోగీలను కూడా నగరానికి తిరిగి తీసుకువస్తామని,అందరికీ టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామని కాషిఫ్ మరో ప్రకటనలో చెప్పారు. జాఫర్ ఎక్స్ప్రెస్,బోలాన్ మెయిల్ రైళ్ల సేవలను ఆగస్టు 14వరకు రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ రైల్వేస్ ప్రకటించింది. బోలాన్ మెయిల్ రైలు ఆగస్టు 16న కరాచీ నుండి బయలుదేరి,మరుసటి రోజు క్వెట్టాకు చేరుకుంటుందని తెలిపారు. ఈఘటనకు మూడురోజుల క్రితం కూడా బలూచిస్తాన్లోని సిబి ప్రాంతంలో క్వెట్టా వైపు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్కి పెద్ద ప్రమాదం తప్పింది. రైల్వే ట్రాక్ పక్కన అమర్చిన బాంబు,రైలు దాటిన క్షణాలకే పేలిపోయిందని డాన్ నివేదికలో పేర్కొంది.