LOADING...
Iran War: ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ .. గల్ఫ్, ఇజ్రాయెల్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్
గల్ఫ్, ఇజ్రాయెల్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్

Iran War: ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ .. గల్ఫ్, ఇజ్రాయెల్‌లపై క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన ఇరాన్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 25, 2026
08:16 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా, ఇజ్రాయెల్‌, ఇరాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధం రోజురోజుకీ మరింత ఉదృతమవుతోంది. యుద్ధం ముగింపుకు చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినప్పటికీ, బాంబుల మోత ఏ మాత్రం తగ్గలేదు. చర్చలు జరుగుతున్నాయన్న వాదనలను ఇరాన్‌ ఖండించింది.యుద్ధం 25వ రోజుకు చేరుకున్న మంగళవారం ఇరాన్‌, ఇజ్రాయెల్‌ పరస్పరం భారీ దాడులు జరిపాయి. ఇజ్రాయెల్‌ ఇరాన్‌, లెబనాన్‌లపై వైమానిక దాడులతో విరుచుకుపడగా, ఇరాన్‌ గల్ఫ్‌ దేశాలతో పాటు ఇజ్రాయెల్‌పై క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. మరోవైపు పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతానికి వేలాది అమెరికా సైనికులను తరలిస్తున్నారు. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శిగా మహమ్మద్‌ బాఘెర్‌ను నియమించారు.

వివరాలు 

ముడి చమురు ధర మళ్లీ బ్యారెల్‌కు 100 డాలర్లు 

ఇదే సమయంలో ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడి పశ్చిమాసియా పరిస్థితిపై చర్చించారు. యుద్ధాన్ని ముగించే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి పాకిస్థాన్‌ ముందుకు వచ్చింది. అయితే యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడంతో ముడి చమురు ధర మళ్లీ బ్యారెల్‌కు 100డాలర్లను దాటింది. యుద్ధం ప్రభావం ఇతర రంగాలపైనా పడుతోంది. ఖతార్‌లో జరగాల్సిన ప్రముఖ పాప్‌ గాయని షకీరా సంగీత కచేరీ వాయిదా పడింది.ఐరోపా పర్యాటక రంగం కూడా ఈ యుద్ధంతో తీవ్రంగా దెబ్బతింది. అమెరికా కాల్పుల విరమణకు అంగీకరించినప్పటికీ, ఇరాన్‌, లెబనాన్‌లపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇక వాషింగ్టన్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ, ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని, విస్తృత ఒప్పందానికి అవకాశం ఉందని తెలిపారు.

వివరాలు 

ఆయుధ కేంద్రాలపై దాడులు

అమెరికా 15 డిమాండ్లు ఉంచినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని ఇరాన్‌ అధికారులు ఖండించారు. ఇరాన్‌ దాడులను ఎదుర్కొనేందుకు గల్ఫ్‌ దేశాలకు స్వల్ప శ్రేణి గగనతల రక్షణ వ్యవస్థలను పంపిస్తున్నామని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తెలిపారు. ఇరాన్‌లోని ఆయుధ తయారీ కేంద్రాలపై ఇజ్రాయెల్‌ వరుసగా దాడులు చేసింది. టెహ్రాన్‌ ఉత్తర ప్రాంతంలో భారీ పేలుళ్లు సంభవించగా, నగర మధ్యలో కూడా మరో పేలుడు చోటుచేసుకుంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో సుమారు 82,000 భవనాలు దెబ్బతిన్నాయి. లెబనాన్‌ రాజధాని బీరుట్‌ దక్షిణ ప్రాంతంలో హెజ్‌బొల్లా మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు చేసింది. ఒక అపార్ట్‌మెంట్‌పై జరిగిన దాడిలో ముగ్గురు మరణించగా, మరో ఐదుగురు దక్షిణ ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

వివరాలు 

టెల్‌ అవీవ్‌ సిటీ సెంటర్‌లో పేలుడు

లెబనాన్‌ ప్రభుత్వం తమ దేశం విడిచి వెళ్లాలని ఇరాన్‌ రాయబారిని ఆదేశించింది. ఇరాన్‌ ప్రయోగించిన 100 కిలోల వార్‌హెడ్‌ క్షిపణి ఇజ్రాయెల్‌లోని టెల్‌ అవీవ్‌ సిటీ సెంటర్‌లో పడింది. పేలుడు ప్రభావంతో సమీప ఇళ్లు, అపార్ట్‌మెంట్‌ల కిటికీలు ధ్వంసమయ్యాయి. ఉత్తర ఇజ్రాయెల్‌లో జరిగిన మరో దాడిలో 30 ఏళ్ల మహిళ మృతి చెందింది. కువైట్‌లో క్షిపణి శకలం పడటంతో విద్యుత్‌ లైన్లు దెబ్బతిని గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Advertisement

వివరాలు 

గల్ఫ్ దేశాలపై దాడులు

బహ్రెయిన్‌పై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరగడంతో పలుమార్లు సైరన్లు మోగాయి. అక్కడ అమెజాన్‌ వెబ్‌ సర్వీసులకు అంతరాయం కలిగినట్లు సంస్థ వెల్లడించింది. యూఏఈ తమపై వచ్చిన క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపింది. సౌదీ అరేబియా తమ చమురు క్షేత్రాలపైకి వచ్చిన 20 డ్రోన్లను అడ్డుకుంది. పశ్చిమాసియాకు అమెరికా మెరీన్లు భారీగా తరలిపోతున్నారు. ఇరాన్‌ చమురు సరఫరాలో కీలకమైన ఖర్గ్‌ ద్వీపాన్ని సీజ్‌ చేయాలనే ఉద్దేశంతో ఈ చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ కార్యదర్శిగా మహమ్మద్‌ బాఘెర్‌ జోల్ఘదర్‌ను నియమించారు. ఇటీవల దాడుల్లో మరణించిన లారిజానీ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బాఘెర్‌ ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ మాజీ కమాండర్‌.

వివరాలు 

చర్చలకు పాకిస్థాన్ ముందుకు

ఇరాన్‌ యుద్ధాన్ని ముగించే చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తెలిపారు. ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. అమెరికా కూడా ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ట్రంప్‌ ఈ విషయాన్ని ట్రూత్‌ సోషల్‌లో పంచుకున్నారు.

వివరాలు 

మార్కెట్లలో ఊగిసలాట

యుద్ధ ప్రభావంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. ప్రారంభంలో పెరిగిన మార్కెట్లు, చమురు ధరలు పెరగడంతో మళ్లీ పడిపోయాయి. చైనా ఎరువుల ఎగుమతులపై నియంత్రణలు విధించింది. జపాన్‌లో ఇంధన అత్యవసర పరిస్థితి ఏర్పడగా, ఫిలిప్పీన్స్‌లో అధ్యక్షుడు ఫెర్డినాండ్‌ మార్కోస్‌ జూనియర్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇంధన, నీటి మౌలిక వసతులపై దాడులు జరిగితే తామూ యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని సౌదీ అరేబియా, యూఏఈ హెచ్చరించాయి.

వివరాలు 

చర్చలకు సంకేతాలు?

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నారని ఇజ్రాయెలీ మీడియా పేర్కొంది. ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ, అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్‌ విట్‌కాఫ్‌ మధ్య జరిగిన తాజా సంభాషణలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు వెల్లడించింది.

Advertisement