
Trump Tariff: చైనాపై 145 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్కు జులై 9 వరకు మినహాయింపు
ఈ వార్తాకథనం ఏంటి
చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతుంది. ప్రపంచ అగ్రశక్తి అయిన అమెరికా పలు దశల్లో చైనాపై విధించిన సుంకాలను మరింతగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటివరకు చైనా ఉత్పత్తులపై విధించిన సుంకాలు మొత్తం 145 శాతానికి చేరుకున్నట్లు అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
కాగా, బుధవారం నాటికి ఈ టారిఫ్లు 125 శాతంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొనగా, గురువారం నాటికి వాటిని 145 శాతానికి పెంచుతూ వైట్ హౌస్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాలు
భారత్కు తాత్కాలిక ఉపశమనం
ఇతర దేశాలపైనా అమెరికా విధించిన సుంకాల పరంపర కొనసాగుతోంది.
అయితే, భారత్పై విధించిన అదనపు 26 శాతం సుంకాల మినహాయింపు జూలై 9వ తేదీ వరకూ అమల్లో ఉంటుందని స్పష్టతనిచ్చింది.
అంతేగాక, ఇప్పటికే అమలులో ఉన్న 10 శాతం సుంకాలను కొనసాగించనున్నట్లు తెలిపింది.
స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం
చైనాపై మరింతగా పన్నులు పెరగడంతో, దీని ప్రభావం అమెరికా స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది. మార్కెట్లు మళ్లీ నష్టాల బాట పట్టాయి.
వివరాలు
సుంకాల వాయిదాకు ట్రంప్ కొత్త ఉత్తర్వులు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా సంతకం చేసిన 14,257 నంబర్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, 75కు పైగా దేశాలకు 90 రోజులపాటు సుంకాల నుంచి మినహాయింపు కల్పించారు.
అయితే, ఈ సడలింపులు చైనా, హాంకాంగ్, మకావ్లకు వర్తించవని స్పష్టంగా పేర్కొన్నారు.
వివరాలు
చైనా తగ్గిన తీరులో స్పందన
అమెరికా తీసుకుంటున్న తీరుతో చైనా అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ఒత్తిళ్లకు తలొగ్గమంటూ చెబుతున్న డ్రాగన్ దేశం, చర్చలకు మాత్రం సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
అమెరికా విధించిన 145 శాతం సుంకాలకు నిరసనగా, ఫిల్మ్ల దిగుమతుల సంఖ్యను తగ్గించింది.
వాణిజ్య శాఖ ప్రతినిధి యాంగ్ కి యాన్ మాట్లాడుతూ.."సుంకాల యుద్ధం చేయాలనుకుంటే, చివరి వరకు పోరాడతాం. అమెరికా ఒత్తిళ్లు, బెదిరింపులు లేదా బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఒప్పందానికి రావాలనుకోవడం సరైన మార్గం కాదు. ఇరు దేశాలు చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలి," అని స్పష్టం చేశారు.
వివరాలు
ఆర్థిక ప్రభావం గణనీయమే
అమెరికా విధించిన 145 శాతం సుంకాల వల్ల సుమారు 438 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఉత్పత్తులపై ప్రభావం చూపనుంది.
ఇక చైనా విధించిన 84 శాతం టారిఫ్లు మాత్రం సుమారు 143 బిలియన్ డాలర్ల అమెరికా ఉత్పత్తులకు నష్టం కలిగించనున్నాయి.
చైనా ప్రజల్లో ఆందోళనలు
ఈ వాణిజ్య పరమైన కఠిన నిర్ణయాల నేపథ్యంలో, చైనా ప్రజల్లో ఆందోళన కలుగుతోంది.
తమ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్న చైనా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ మొదలు పెట్టాయని, లేఆఫ్ల గురించి సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్న పోస్ట్లు ఆందోళన కలిగిస్తున్నాయి.