LOADING...
Trump: 'భారత్ అలా చేయదు'.. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు
'భారత్ అలా చేయదు'.. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు

Trump: 'భారత్ అలా చేయదు'.. ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌లో శాంతి పరిరక్షణ దళాలుగా భారత సైనికులను పంపాలన్న ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నవ్వుతూ తిరస్కరించినట్లు తాజాగా వెలువడిన ఓ పుస్తకం వెల్లడించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు అందులో పేర్కొన్నారు. "రెజీమ్ చేంజ్: ఇన్‌సైడ్ ది ఇంపీరియల్ ప్రెసిడెన్సీ ఆఫ్ డొనాల్డ్ ట్రంప్" పేరుతో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్టులు మ్యాగీ హేబర్మన్, జోనాథన్ స్వాన్ రచించిన ఈ పుస్తకంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడంలో అమెరికా పాత్ర ఏమిటనే అంశంపై వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ఈ చర్చ జరిగినట్లు రచయితలు పేర్కొన్నారు.

వివరాలు 

కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు..

ఆ సమావేశంలో ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్, అలాగే ఉక్రెయిన్-రష్యా వ్యవహారాల కోసం ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెలాగ్ పాల్గొన్నారు. ఉక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం కనుగొనేందుకు అమెరికా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కీత్ కెలాగ్ "అమెరికా ఫస్ట్ ప్లాన్: ట్రంప్ చారిత్రాత్మక రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందం" పేరుతో ఓ ప్రతిపాదనను సమావేశంలో వివరించారు. అందులో కాల్పుల విరమణ అమలును పర్యవేక్షించేందుకు ఫ్రాన్స్, బ్రిటన్, నెదర్లాండ్స్ దేశాల శాంతి బలగాలను ఉక్రెయిన్‌లో మోహరించాలని సూచించారు.

వివరాలు 

భారతీయులు అలా చేయరు

అయితే నాటో దేశాల సైన్యాన్ని ఉక్రెయిన్‌లోకి పంపితే రష్యాతో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం ఉందని జేడీ వాన్స్ ఆందోళన వ్యక్తం చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా భారత్ లేదా సౌదీ అరేబియా వంటి దేశాల సైన్యాన్ని వినియోగించే అంశాన్ని వాన్స్ ప్రస్తావించినట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ట్రంప్ వెంటనే ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు పుస్తకం పేర్కొంది. "భారతీయులు అలా చేయరు. అలాంటి కార్యక్రమాల కోసం వారు డబ్బు ఖర్చు పెట్టరు" అని ట్రంప్ వ్యాఖ్యానించినట్లు రచయితలు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, ఇలాంటి కార్యక్రమాలకు భారత్ ఆర్థికంగా సహకరించదనే అభిప్రాయాన్ని ట్రంప్ వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు

ఇక ఈ పుస్తకంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీపై కూడా ట్రంప్ విమర్శలు చేసినట్లు వెల్లడైంది. జెలెన్‌స్కీని "సమర్థవంతంగా చర్చలు జరపలేని నాయకుడు"గా ట్రంప్ అభివర్ణించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. మరో సందర్భంలో భారత్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను కూడా పుస్తకం ప్రస్తావించింది. అమెరికాలో ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయని దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని, చైనా 150 నుంచి 200 శాతం వరకు సుంకాలు విధిస్తోందని, భారత్ 175 శాతం వరకు సుంకాలు విధిస్తోందని ట్రంప్ పేర్కొన్నట్లు అందులో వెల్లడైంది. ట్రంప్ రెండో అధ్యక్ష పదవీకాలంలోని తొలి 14 నెలల రాజకీయ పరిణామాలు, అంతర్గత చర్చలు, కీలక నిర్ణయాలకు సంబంధించిన పలు వివరాలను ఈ పుస్తకం బయటపెట్టింది.

Advertisement