
Iran-Israel: ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటన.. ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణుల వర్షం!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పరిస్థితులు క్షణం క్షణానికి మలుపు తిరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ, ఘర్షణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున టెహ్రాన్ నుంచి టెల్ అవీవ్ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించారు. దీంతో పలు ప్రాంతాల్లో సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణులు దేశం వైపు దూసుకువస్తున్నాయని ఇజ్రాయెల్ సైన్యం ప్రజలకు హెచ్చరించింది. ప్రజలంతా సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించింది. దక్షిణ, మధ్య ఇజ్రాయెల్ లక్ష్యంగా క్షిపణులను ప్రయోగించారని ఐడీఎఫ్ ప్రకటించింది.
Details
ఆరు క్షిపణులను ప్రయోగించినట్లు సమచారం
జెరూసలెం, బీర్షెబా ప్రాంతాల్లో దాడులు జరగగా, బీర్షెబాలోని ఓ భవనం తీవ్రంగా దెబ్బతింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. కొంతమందిని విషమస్థితిలో ఆసుపత్రికి తరలించినట్టు స్థానిక వార్తలు తెలిపాయి. ఇరాన్ ఇప్పటివరకు మొత్తం 6 క్షిపణులను ప్రయోగించినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది. టెహ్రాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4 గంటల తర్వాత ఈ క్షిపణులను ప్రయోగించారు. అంతకుముందే ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ, ఎలాంటి ఒప్పందం కుదరలేదని తెలిపారు.
Details
టెహ్రాన్ నగరంలోనూ సైరన్లు
మంగళవారం తెల్లవారుజామున 4 గంటల లోపు టెల్ అవీవ్ దాడులను ఆపితేనే తాము కూడా ఘర్షణలను నిలిపేస్తామని సూచించారు. కానీ కొన్ని గంటలకే ఇరాన్ మళ్లీ దాడులు జరపడం గమనార్హం. ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై ప్రతిదాడులకు దిగినట్టు సమాచారం. దీంతో టెహ్రాన్ నగరంలోనూ సైరన్లు మోగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ మాత్రం 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్, ఇజ్రాయెల్ పూర్తి కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడం విశేషం. 12 గంటల్లో యుద్ధం పూర్తిగా ముగుస్తుందన్నారు. అయితే ట్రంప్ ప్రకటనపై ఇరాన్ తొలుత విరుద్ధంగా స్పందించగా, కొంతసేపటికి ఒప్పందానికి సుముఖత ఉన్నట్టు సూచనప్రాయంగా తెలిపింది. మరోవైపు, ఇజ్రాయెల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.