
Donald Trump: ఇరాన్ శాంతిని ఎంచుకోకపోతే అంతం చేస్తాం : ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ అణుకేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా (USA) ప్రత్యక్ష దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్పై జరిపిన ఈ దాడులను 'చారిత్రక క్షణం'గా ఆయన అభివర్ణించారు. "ఇరాన్పై మా దాడులు విజయవంతమయ్యాయి. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ చేరింది. ముఖ్యమైన అణుకేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేశాం. ఇరాన్ అణుసామర్థ్యాన్ని నాశనం చేయడమే మా లక్ష్యం. ప్రపంచం ఎదుర్కొంటున్న అణు ముప్పును నివారించడం, పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడమే మా ఉద్దేశ్యం.
Details
ఇతర దేశాలను ఇరాన్ భయపెడుతోంది
పశ్చిమాసియాలోని ఇతర దేశాలను ఇరాన్ భయపెడుతోంది. ఇక ఇప్పుడు ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పే బాధ్యత టెహ్రాన్దే. ఇరాన్లో ఇంకా కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయి. టెహ్రాన్ శాంతిని నెలకొల్పకపోతే, తదుపరి దాడులు మరింత తీవ్రతరం అవుతాయి. యూఎస్, టెల్ అవీవ్ (Tel Aviv) కలిసికట్టుగా పనిచేస్తాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుకు ట్రంప్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇజ్రాయెల్, యూఎస్లు ఒకే టీమ్లా పని చేశాయని అన్నారు. ఇజ్రాయెల్ మిలిటరీపై ప్రశంసలు కురిపిస్తూ, తాజా దాడుల్లో అమెరికా సేనలు అద్భుతంగా రాణించాయని అభినందించారు.
Details
దాడులు విజయవంతం
"ఇది పూర్తిగా సైనిక విజయమే. శాంతి కావాలా? విషాదం కావాలా? అనేది టెహ్రాన్ నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో త్వరగా శాంతిని నెలకొల్పకపోతే, మిగతా లక్ష్యాలన్నిటినీ అంతం చేస్తామని కూడా హెచ్చరించారు. ఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహన్ అణుకేంద్రాలపై అమెరికా భీకర దాడులు జరిపింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే వెల్లడించారు. "విజయవంతంగా దాడులు జరిపాము. ఇప్పుడు శాంతికి సమయం ఆసన్నమైంది" అని పిలుపునిచ్చారు. ఇరాన్ మీడియా సంస్థలు కూడా ఈ దాడులను ధృవీకరించాయి.