Donald Trump: పనామా కెనాల్ విషయంలో పంతం నెగ్గించుకున్న ట్రంప్.. అమెరికా నౌకలు ఫ్రీగా ప్రయాణించేందుకు కుదిరిన ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పనామా కెనాల్ విషయంలో కొంతమేరకు పంతం నెగ్గించుకొన్నారు.
ఈ విషయమై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ మధ్య ఒప్పందం జరిగింది.
పనామా కెనాల్ నుండి తమ యుద్ధ నౌకలు ప్రయాణించేటప్పుడు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా రక్షణ మంత్రి హెగ్సే తెలిపారు.
ఈ ఒప్పందం ప్రకారం, అమెరికా ప్రభుత్వ నౌకలకు భారీ మొత్తంలో నగదు మిగులుతుందని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, అక్రమ వలసదారులపై పనామా ప్రభుత్వం తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన అభినందించారు.
వివరాలు
పనామాలో ఆందోళనలు
అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ ఒప్పందాన్ని ధ్రువీకరించింది.
"అమెరికా ప్రభుత్వ నౌకలు ఇప్పుడు పనామా కెనాల్ నుండి ఎటువంటి ఛార్జీలు లేకుండా ప్రయాణించవచ్చు" అని ఎక్స్లో పేర్కొంది.
పనామా, కొన్నాళ్ల క్రితం కొన్ని రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది, దీనిని విదేశాంగ మంత్రి రూబియో ఆదివారమే వెల్లడించారు.
ట్రంప్ నవంబర్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత, పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
ఇందుకోసం సైనిక శక్తిని కూడా ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. దీంతో, పనామాలో ఆందోళనలు మొదలయ్యాయి.
వివరాలు
40 శాతం కంటైనర్లు పనామా ద్వారా
అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామా ద్వారా ప్రయాణిస్తాయి.
చైనాకు చెందిన సంస్థలు పనామా ఓడరేవుల్లో పెట్టుబడులు పెట్టడాన్ని ట్రంప్ మరియు విదేశాంగ మంత్రి రూబియో తప్పుపట్టారు.
ఈ ఒత్తిడి కారణంగా, పనామా అధ్యక్షుడు జాస్ రౌల్ మోలినో చైనాకు చెందిన బీఆర్ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులను పునరుద్ధరించమని హామీ ఇచ్చారు.
ట్రంప్ కొంత అసంతృప్తిగా ఉన్నా, పనామా కొన్నింటికి అంగీకరించడంతో ఆయన కొంత మెత్తబడారు.
వివరాలు
పనామా ప్రభుత్వం కాలువ అభివృద్ధికి భారీ మొత్తంలో ఖర్చు
పనామా కాల్వను 1914లో అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయప్రయాసలతో నిర్మించింది.
మొదటిసారి అమెరికానే దీన్ని నిర్వహించింది. కానీ, పనామా దేశంలో ఆ కాల్వపై తీవ్ర అసంతృప్తి ఉందని, ఘర్షణలు చెలరేగడం కారణంగా 1977లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
పనామా కాల్వను ఆ దేశానికి అప్పజెబుతూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అమెరికా ఈ కాల్వ తటస్థంగా ఉండాలని షరతు పెట్టింది, అలాగే ఎటువంటి ముప్పు వచ్చినా, అమెరికాకు దానిని రక్షించుకునే హక్కు ఉంటుందని పేర్కొంది.
తరువాత, పనామా ప్రభుత్వం ఈ కాలువ అభివృద్ధికి భారీ మొత్తంలో ఖర్చు చేసింది.