
Putin: రష్యా సైనికుడు ఎక్కడ అడుగుపెడితే, అది మాదే.. ఉక్రెయిన్కు పుతిన్ వార్నింగ్!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రష్యా బలగాలు సుమీ ప్రాంతంలోని బఫర్ జోన్ లోకి ప్రవేశించాయి. ఈ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అంతా రష్యాదేనని ఆయన తెలిపారు. అదే సమయంలో కీవ్ పై తీవ్ర హెచ్చరికలు చేశారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఉక్రెయిన్ వైపు నుండి సరిహద్దుల వెంట షెల్లింగ్ జరుగుతుండటంతో మాకు ముప్పు పెరుగుతోంది. సుమీ ప్రాంతంలో రష్యా బలగాలు 10 కి.మీ లోతువరకు ప్రవేశించాయి. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యం మాకు లేదు.
Details
ఉక్రెయిన్ అంతా రష్యాదే
కానీ పరిస్థితి తీవ్రతరమైతే, అది స్వాధీనం కాకుండా ఉంటుందని అనుకోకూడదని పుతిన్ వ్యాఖ్యానించారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒకే ప్రజలని నమ్ముతున్నాను. ఈ కోణంలో ఉక్రెయిన్ అంతా రష్యాదే. అయినప్పటికీ ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గుర్తించేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఉక్రెయిన్ లొంగిపోవాలని అనుకోవడం లేదు. కానీ ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఉన్న వాస్తవాలను వారు అంగీకరించాలి. మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తించాలి. నాటోలో చేరాలన్న ఆకాంక్షని ఉక్రెయిన్ విరమించుకోవాలి. సైనిక చర్యలు మరింత తీవ్రతరం కాకముందే ఉక్రెయిన్ చర్చలకు రావాలి. రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవాలి. రష్యా సైనికుడు ఎక్కడ అడుగుపెడితే, ఆ భూభాగం రష్యాదే అని ఉక్రెయిన్ గుర్తుంచుకోవాలని పుతిన్ హెచ్చరించారు.