Page Loader
BYD cars: తెలంగాణకు బీవైడీ.. హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌
తెలంగాణకు బీవైడీ.. హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌

BYD cars: తెలంగాణకు బీవైడీ.. హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల యూనిట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా విద్యుత్తు కార్ల దిగ్గజ సంస్థ బీవైడీ (BYD) తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు కార్ల ఉత్పత్తి యూనిట్‌ను స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి బీవైడీ సంస్థ గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తోంది. ఇటీవలే తుది నిర్ణయాన్ని ప్రకటించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూమిని కేటాయించడం సహా అన్నిరకాల మద్దతును అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సమాచారం.

వివరాలు 

యూనిట్‌ స్థాపనకు మూడు ప్రాంతాల పరిశీలన 

హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు కార్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు అనువైన మూడు ప్రదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బీవైడీకి ప్రతిపాదించింది. ఈ ప్రాంతాలను బీవైడీ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు. తుది ప్రదేశాన్ని ఎంపిక చేసిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశముంది. ఈ ప్రాజెక్ట్‌ కార్యరూపం దాల్చినట్లయితే, తెలంగాణ విద్యుత్తు కార్ల రంగంలో అతిపెద్ద ప్రైవేట్ పెట్టుబడిని ఆకర్షించే గౌరవాన్ని పొందుతుంది. అంతేకాకుండా, విద్యుత్తు కార్ల విడిభాగాలను ఉత్పత్తి చేసే అనుబంధ పరిశ్రమలు కూడా ఈ యూనిట్‌ చుట్టూ అభివృద్ధి చెందే అవకాశముంది. దీనివల్ల హైదరాబాద్‌ సమీపంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమకు ఒక క్లస్టర్‌ రూపుదిద్దుకునే వీలుంటుంది.

వివరాలు 

భారతదేశంలో బీవైడీ తొలి ఉత్పత్తి యూనిట్ 

బీవైడీ సంస్థ ఇప్పటికే భారత్‌లో విద్యుత్తు వాహనాల విక్రయాలు చేపట్టినప్పటికీ, ఇక్కడ తమ స్వంత ఉత్పత్తి యూనిట్‌ లేదు. ప్రస్తుతానికి, బీవైడీ చైనాలో ఉత్పత్తి చేసిన విద్యుత్తు కార్లను భారత్‌కు దిగుమతి చేసి విక్రయిస్తోంది. అయితే, అధిక దిగుమతి సుంకాల కారణంగా ఈ కార్ల ధరలు ఎక్కువగా ఉండటంతో, ఆశించిన స్థాయిలో విక్రయాలు సాధించలేకపోతోంది. దేశీయంగా ఉత్పత్తి ప్రారంభిస్తే, ఈ కార్ల ధరలు తగ్గే అవకాశముంది. దీంతో బీవైడీ భారత మార్కెట్‌లో విద్యుత్తు కార్ల విక్రయాలను పెంచుకునే వీలుంటుంది.

వివరాలు 

బీవైడీ ప్రాజెక్టుకు మార్గం సుగమం 

బీవైడీ సంస్థ గత రెండు సంవత్సరాలుగా భారత్‌లో ఉత్పత్తి యూనిట్‌ స్థాపించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ చైనా పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం విధించిన కఠినమైన నిబంధనల వల్ల ముందుకు సాగలేకపోయింది. అయితే, తాజాగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించడంతో, బీవైడీ ప్రాజెక్టుకు మార్గం సుగమమైందని తెలుస్తోంది. హైదరాబాద్‌ కేంద్రంగా విద్యుత్తు బస్సుల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎంఈఐఎల్‌ గ్రూపు అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ (Olectra Greentech) బీవైడీతో సాంకేతిక భాగస్వామ్యం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సరఫరా చేస్తున్న విద్యుత్తు బస్సులు, బీవైడీ టెక్నాలజీ ఆధారంగా తయారవుతున్నాయి. ఈ కారణంతోనే బీవైడీ తన విద్యుత్తు కార్ల ఉత్పత్తి యూనిట్‌ కోసం తెలంగాణను ఎంచుకున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

వివరాలు 

బ్యాటరీ ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రణాళిక 

కేవలం కార్ల అసెంబ్లింగ్‌ ప్లాంట్‌కే కాకుండా, 20 గిగావాట్ల సామర్థ్యంతో భారీ బ్యాటరీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా బీవైడీ భారత్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సంస్థ దశలవారీగా భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఐదేళ్ల నుంచి ఏడు సంవత్సరాల్లో,ప్రతి ఏడాదికి 6 లక్షల విద్యుత్తు కార్లను ఉత్పత్తి చేసే లక్ష్యంతో బీవైడీ తన కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా విద్యుత్తు కార్ల రంగంలో బీవైడీ,అమెరికాకు చెందిన టెస్లాకు గట్టి పోటీ ఇస్తోంది. 2024లో టెస్లా కంపెనీ ఆదాయం 97.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 8.40 లక్షల కోట్లు)గా ఉంటే, బీవైడీ ఆదాయం 107 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 9.20 లక్షల కోట్లు)కి పెరిగింది.

వివరాలు 

 ఒకసారి ఛార్జ్‌ చేస్తే  400 కిలోమీటర్ల వరకు ప్రయాణం 

ముఖ్యంగా చైనా, ఐరోపా మార్కెట్లలో టెస్లా అమ్మకాలు తగ్గుతుండగా, బీవైడీ అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇటీవల, విద్యుత్తు కార్లను కేవలం 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలో పూర్తిగా ఛార్జింగ్‌ చేసే సామర్థ్యం కలిగిన 1 మెగావాట్‌ ఫ్లాష్‌ ఛార్జర్‌ను బీవైడీ విడుదల చేసింది. ఈ కొత్త టెక్నాలజీ ద్వారా విద్యుత్తు వాహనాలు ఒకసారి ఛార్జ్‌ చేయించుకొని 400 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలవు. పరిశ్రమ నిపుణుల అభిప్రాయంలో, ఈ విప్లవాత్మక మార్పులతో విద్యుత్తు వాహనాల భవిష్యత్తు మరింత వేగంగా అభివృద్ధి చెందనుంది.