
Adani Airports: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ!
ఈ వార్తాకథనం ఏంటి
గౌతమ్ అదానీ నేతృత్వంలో నడుస్తున్న అదానీ గ్రూప్ నుంచి మరో కంపెనీ పబ్లిక్ ఇష్యూకి సిద్ధమవుతోంది.
దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ (Adani Airports)ను ఐపీఓ (ప్రాథమిక షేర్ మార్కెట్ విడుదల) ద్వారా పెట్టుబడిదారుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్నారు.
ఈ కంపెనీని 2027 నాటికి స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదికలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ 2027 మార్చి లోపు పూర్తి కావచ్చని తెలుస్తోంది.
వివరాలు
భారతదేశంలో ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ తన వ్యాపార వ్యాప్తిని విస్తరించేందుకు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది.
సంస్థ వృద్ధి వ్యూహానికి అనుగుణంగా రానున్న సంవత్సరాల్లో వివిధ రంగాల్లో మొత్తంగా రూ.8 లక్షల కోట్లు (అంటే సుమారు 100 బిలియన్ డాలర్లు) మౌలిక సదుపాయాలపై ఖర్చు చేయనుంది.
ప్రస్తుతం ఈ గ్రూప్ భారతదేశంలో ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తోంది.
అందులో ముంబయి నగరానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న నవీ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది, ఇది త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇక మూలధన వ్యయం ప్రణాళికలను కూడా సంస్థ మరింత వేగవంతం చేసింది.
వివరాలు
ఐదు నుండి ఆరు సంవత్సరాల్లోనే 100బిలియన్ డాలర్లు
గతంలో పదేళ్లలో పెట్టుబడి పెట్టాలనుకున్న 100బిలియన్ డాలర్లను ఇప్పుడు కేవలం ఐదు నుండి ఆరు సంవత్సరాల్లోనే వినియోగించేందుకు కంపెనీ సన్నద్ధమవుతోంది.
ఇటీవల అదానీ ఎయిర్పోర్ట్స్ సంస్థ అంతర్జాతీయ బ్యాంకుల సమూహం (కన్సార్టియం) నుండి 750 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.6,400 కోట్లు)రుణంగా పొందింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ కు అనుబంధంగా ఉన్న ఈ ఏఏహెచ్ఎల్ (Adani Airports Holdings Ltd) సంస్థ ఈ రుణాన్నిఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ (ECB) ద్వారా సమకూర్చింది.
ప్రస్తుతం కంపెనీపై ఉన్న 400మిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేసేందుకు ఈ నిధులను వినియోగించనుంది.
విమానయాన రంగంలో తన స్థిరమైన ఆధిపత్యాన్ని మరింతగా బలోపేతం చేసుకోవడమే అదానీ గ్రూప్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.
వ్యాపార విస్తరణకు అనుగుణంగా సంస్థ ముందడుగు వేస్తోంది.