
Airtel IPTV: 2000 నగరాల్లో ఎయిర్టెల్ IPTV సేవలు.. ప్లాన్ల వివరాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తన ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ (ఐపీటీవీ) సేవలను దేశవ్యాప్తంగా 2,000 నగరాలకు విస్తరించినట్లు ప్రకటించింది.
వినియోగదారులకు పెద్ద తెరపై అధిక గుణాత్మక వీక్షణ అనుభూతిని అందించేందుకు ఈ సేవలను వేగంగా విస్తరిస్తున్నట్లు తెలిపింది.
త్వరలో దిల్లీ, రాజస్థాన్, అస్సాం, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.
వివరాలు
ఐపీటీవీ సేవల ప్రత్యేకతలు
ఈ సేవల ద్వారా వైఫై సదుపాయంతో పాటు నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ+, సోనీలివ్, జీ5 వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లు, 600 టెలివిజన్ ఛానెళ్లు అందుబాటులో ఉంటాయని ఎయిర్టెల్ తెలిపింది.
ఈ ప్లాన్లు రూ.699 నుంచి ప్రారంభమవుతాయని ప్రకటించింది. అంతేకాదు, ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా కనెక్షన్ బుక్ చేసుకున్న వినియోగదారులకు ప్రారంభ ఆఫర్ కింద 30 రోజుల పాటు ఉచిత సేవలు అందించనుందని తెలిపింది.
వివరాలు
ఐపీటీవీ ప్లాన్ల వివరాలు
రూ.699 - 40 Mbps, 26 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెళ్లు
రూ.899 - 100 Mbps, 26 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెళ్లు
రూ.1099 - 200 Mbps, 28 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెళ్లు
రూ.1599 - 300 Mbps, 29 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెళ్లు
రూ.3999 - 1 Gbps, 29 స్ట్రీమింగ్ యాప్స్, 350 టీవీ ఛానెళ్లు
వివరాలు
రూ.5,985 కోట్ల స్పెక్ట్రమ్ బకాయిల చెల్లింపు
స్పెక్ట్రమ్ బకాయిలకు సంబంధించి భారతీ ఎయిర్టెల్, దాని అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్, ప్రభుత్వానికి రూ.5,985 కోట్లు ముందస్తుగా చెల్లించినట్లు కంపెనీ వెల్లడించింది.
2024లో నిర్వహించిన వేలానికి సంబంధించిన బకాయిలను ముందుగా చెల్లించడం ద్వారా, భవిష్యత్తులో పెరిగే వ్యయాలను తగ్గించుకోవాలని ఎయిర్టెల్ లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ.25,981 కోట్లు చెల్లించగా, ఇప్పటి వరకు మొత్తం రూ.66,665 కోట్లు ప్రభుత్వానికి చెల్లించినట్లు పేర్కొంది.