
Amazon India: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన అమెజాన్.. ఇకపై ప్రతి ఆర్డర్ రూ.5 అదనంగా చెల్లించాలి..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు ఊహించని షాక్ తగిలింది.
ఇప్పటి వరకు ఉచితంగా అందించిన సేవలపై ఇకపై రూ. 5 ఫ్లాట్ ఫీజు విధించనున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఈ కొత్త ఛార్జీ ప్రైమ్ సబ్స్క్రైబర్లకు కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంతో ఇప్పటికే ప్రీమియం సేవలతో అనేక లాభాలు పొందుతున్న ప్రైమ్ యూజర్లకు పెద్ద దెబ్బే అని చెప్పాలి.
అమెజాన్ తీసుకున్న ఈ కీలక నిర్ణయానికి వెనుక గల ప్రధాన కారణం పరిశీలిస్తే,బ్లింకిట్,జెప్టో,స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటి డెలివరీ దిగ్గజాలు ఇప్పటికే అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యంలో, అమెజాన్ కూడా అదే దిశగా అడుగులు వేయాలని భావించినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఇతర డెలివరీ ప్లాట్ఫామ్స్ అనుసరిస్తున్న వ్యూహాలే..
ఇదే సమయంలో, అమెజాన్ ప్రధాన పోటీదారు ఫ్లిప్కార్ట్ కూడా 2024 మధ్యలో రూ. 3 ఫీజు వసూలు చేయడం ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలపై మార్కెట్ విశ్లేషణ సంస్థ డాటమ్ ఇంటెలిజెన్స్కు చెందిన ప్రముఖ కన్సల్టెంట్ సతీష్ మీనా స్పందిస్తూ, అమెజాన్ తన ఆదాయ వనరులను పెంచేందుకు మానిటైజేషన్ వ్యూహంలో భాగంగా ఈ చర్య తీసుకుందని తెలిపారు.
ఇతర డెలివరీ ప్లాట్ఫామ్స్ అనుసరిస్తున్న వ్యూహాలే అమెజాన్ కూడా అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
వినియోగదారులు ఈ ఛార్జీ నుండి తప్పించుకునే అవకాశమేమీ లేకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
వివరాలు
అన్ని సాధారణ ఆర్డర్లకు ఫ్లాట్ ఫీజు
రవాణా, సిబ్బంది, ఇంధనం వంటి డెలివరీకి సంబదించిన ఈ కామర్స్ రంగం పెరుగుతున్న ఖర్చులను మానేజ్ చెయ్యడానికి దిగ్గజాలన్నీ ఇప్పుడు ప్రతి ఆర్డర్పై ఈ రకమైన రుసుములను వసూలు చేస్తున్నాయని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఛార్జీలను సమర్ధించేందుకు కొన్ని సంస్థలు వినియోగదారులు తమ సౌలభ్యం కోసం ఇదే తీరుగా అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా చెబుతున్నాయి.
రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు ఈ ఛార్జీలను పెంచే అవకాశముందని కూడా సతీష్ మీనా అభిప్రాయపడ్డారు.
గత నెల నుండి అమెజాన్ ఇండియా రూ. 5 మార్కెట్ప్లేస్ ఫీజును ప్రతి ఆర్డర్పై విధించడం ప్రారంభించింది.
కంపెనీ బ్లాగ్లో పేర్కొన్నదాని ప్రకారం,ఈ ఫ్లాట్ ఫీజు అన్ని సాధారణ ఆర్డర్లకు వర్తించనుంది.
వివరాలు
ఫీజు నుండి మినహాయింపు వీటికే..
అయితే, గిఫ్ట్ కార్డులు, డిజిటల్ సేవలు వంటి కొన్ని వర్గాలు మాత్రం ఈ ఫీజు నుండి మినహాయింపును పొందినట్లుగా అమెజాన్ వెల్లడించింది.
ఈ ఛార్జీ వల్ల మిలియన్ల వ్యాపారులకు చెందిన వివిధ ఉత్పత్తులను వినియోగదారులకు అందించడంలో సంస్థకు సహాయపడుతుందని చెప్పింది.
గిఫ్ట్ కార్డుల కొనుగోలు, అమెజాన్ బిజినెస్ ఆర్డర్లు, బజార్, అమెజాన్ నౌ, అమెజాన్ ఫ్రెష్ లాంటి ప్రత్యేక సేవలకు ఈ ఛార్జీ వర్తించదు.
అంతేకాక, మొబైల్ రీఛార్జ్లు, బిల్లు చెల్లింపులు, ప్రయాణ/సినిమా టికెట్ బుకింగ్లు, బీమా సేవలు, అలెక్సా స్కిల్స్, ఫైర్ టీవీ యాప్లు, ప్రైమ్ వీడియో అద్దె సేవలు, సబ్స్క్రిప్షన్లు, అలాగే ఇమెయిల్ ద్వారా అందించే డిజిటల్ ఉత్పత్తులకు కూడా ఈ ఫీజు మినహాయింపు లభిస్తుంది.
వివరాలు
తిపెద్ద షాపింగ్ ఈవెంట్గా.. అమెజాన్ ప్రైమ్ డే
ఇక 2024లో నిర్వహించిన అమెజాన్ ప్రైమ్ డే ఈవెంట్ ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద షాపింగ్ ఈవెంట్గా నిలిచింది.
అమెజాన్ ప్రకారం, ఈ ఏడాది ప్రైమ్ సభ్యులు ఒకే నిమిషంలో 24,196 ఆర్డర్లు పెట్టగా, గత ఏడాది ఇదే సంఖ్య 22,190గా ఉంది.
2023 నవంబర్లో జరిగిన "అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (AGIF)" నెల రోజుల పాటు కొనసాగిన ఈవెంట్కు 1.4 బిలియన్ కస్టమర్లు హాజరైనట్లు సంస్థ పేర్కొంది.
అందులోనూ మెట్రో నగరాలకు చెందినవారు కంటే మెట్రోయేతర ప్రాంతాల వినియోగదారులే ఎక్కువగా ఉన్నారు.
మొత్తం మీద 2023లో అమెజాన్ ఇండియా సైట్ను 1.1 బిలియన్ల మంది సందర్శించారు. అలాగే దాదాపు 4 మిలియన్ల మంది కొత్త కస్టమర్లు అమెజాన్ ప్లాట్ఫామ్కు చేరినట్లు సమాచారం.