
Budget 2025:విదేశీ సహాయంలో మాల్దీవులకు నిధులు పెంపు.. ఈ జాబితాలో ఏ దేశం అగ్రస్థానంలో ఉందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్ 2025లో విదేశాంగ మంత్రిత్వ శాఖకు రూ.20,516 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా, ఇతర దేశాలకు ఆర్థిక సహాయం కింద రూ.5,483 కోట్లు మంజూరు చేయనున్నారు. ఇది గత ఏడాది సవరించిన రూ.5,806 కోట్ల కంటే స్వల్పంగా తక్కువ. అయినప్పటికీ, పొరుగు దేశమైన భూటాన్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2025-26 బడ్జెట్లో భూటాన్కు రూ.2,150 కోట్లు కేటాయించారు, అయితే ఇది గత ఏడాది సవరించిన రూ.2,543 కోట్ల కంటే తక్కువ. అయినా, భారత్ భూటాన్కు కీలక అభివృద్ధి భాగస్వామిగా కొనసాగుతోంది. ఈ నిధులను ఆ దేశంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఆర్థిక సహకారం కోసం ఉపయోగిస్తారు.
వివరాలు
మాల్దీవులకు కేటాయింపు పెరుగుదల
దౌత్య సంబంధాల పునరుద్ధరణ నేపథ్యంలో, మాల్దీవులకు బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి. గత బడ్జెట్లో రూ.470 కోట్లను మంజూరు చేయగా, ఈసారి రూ.600 కోట్లకు పెంచారు. ఇది గత ఏడాదితో పోల్చితే 28% అధికం. ఇదే సమయంలో, నేపాల్కు రూ.700 కోట్ల ఆర్థిక సహాయంతో రెండో స్థానంలో నిలిచింది, మాల్దీవులు రూ.600 కోట్లతో మూడో స్థానంలో ఉంది.
వివరాలు
మారిషస్,మయన్మార్కు తగ్గిన నిధులు
ఈసారి మారిషస్కు కేటాయింపులో కోత విధించారు. గత బడ్జెట్లో రూ.576 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.500 కోట్లకు తగ్గించారు. ఇదే విధంగా, మయన్మార్కు రూ.400 కోట్ల నుంచి రూ.350 కోట్లకు తగ్గించారు. మరోవైపు, శ్రీలంక (రూ.300 కోట్లు), బంగ్లాదేశ్ (రూ.120 కోట్లు)కు కేటాయింపుల్లో మార్పు లేదు.
వివరాలు
ఆఫ్ఘనిస్థాన్,ఆఫ్రికన్ దేశాలకు పెరిగిన నిధులు
తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్కు గత ఏడాది రూ.50 కోట్ల ఆర్థిక సహాయం అందించగా, ఈసారి దాన్ని రూ.100 కోట్లకు రెట్టింపు చేశారు. అదేవిధంగా, ఆఫ్రికన్ దేశాలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.200 కోట్ల నుంచి రూ.225 కోట్లకు పెంచారు. చాబహార్ నౌకాశ్రయానికి స్థిర నిధులు ఇరాన్లోని చాబహార్ పోర్ట్కు గత బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లలో ఎలాంటి మార్పు చేయలేదు. ఇది యథావిధిగా కొనసాగుతుంది.