
Gold loan: గోల్డ్ లోన్స్పై కొత్త మార్గదర్శకాలను సడలించాలి.. ఆర్బిఐకి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
బంగారం తాకట్టు పెట్టి పొందే రుణాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) ఇటీవల ప్రతిపాదించిన కొత్త మార్గదర్శకాలపై ఇప్పుడు ఆర్థిక మంత్రిత్వశాఖ స్పందించింది.
చిన్న మొత్తంలో రుణాలు తీసుకొనే వర్గాలను ఈ మార్గదర్శకాలు ప్రభావితం చేయకుండా చూసేందుకు, రూ.2 లక్షల వరకు రుణాలు తీసుకునే వ్యక్తులను ఈ నూతన నిబంధనల నుంచి మినహాయించాలని ఆర్బీఐకి సూచించింది.
తమిళనాడులో రాజకీయ పార్టీలు, పాలక మిత్రపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఈ జోక్యం చోటుచేసుకుంది.
వివరాలు
పసిడి రుణాలపై ముసాయిదా మార్గదర్శకాలు
గత ఏప్రిల్ 9న ఆర్బీఐ పసిడి రుణాలపై ముసాయిదా మార్గదర్శకాలు విడుదల చేసింది.
అందులో భాగంగా, బంగారాన్ని తాకట్టు పెట్టి ఇచ్చే రుణం, ఆ బంగారం మార్కెట్ విలువలో 75 శాతం మించకూడదని స్పష్టంగా పేర్కొంది.
అంటే రూ.1 లక్ష విలువైన బంగారం తాకట్టు పెట్టితే, గరిష్ఠంగా రూ.75,000 వరకే రుణం మంజూరు అవుతుంది.
దీనివల్ల చిన్న, మధ్యతరగతి రైతులు,లఘు వ్యాపారులకు తగినంత రుణం అందడం కష్టమవుతుందని అభిప్రాయపడుతూ, తమిళనాడు రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ముఖ్యమంత్రి స్టాలిన్ స్వయంగా ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు.
వివరాలు
రూ.2 లక్షల లోపు రుణాలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలని ఆర్బీఐకి సూచన
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) ఆర్బీఐ జారీ చేసిన ముసాయిదాను సమీక్షించింది.
చిన్న స్థాయి బంగారు రుణగ్రహీతల అవసరాలను దృష్టిలో ఉంచుకొని, కొత్త మార్గదర్శకాలు వారికి భారం కాకుండా ఉండాలని ఆర్బీఐకి సూచించింది.
ప్రత్యేకంగా రూ.2 లక్షల లోపు రుణాలను ఈ నిబంధనల నుంచి మినహాయించాలని స్పష్టం చేసింది.
అలాగే, ఈ మార్గదర్శకాలను అమలు చేయడానికి క్షేత్రస్థాయిలో తగిన సమయం అవసరమని పేర్కొంటూ, వాటిని 2026 జనవరి 1 నుంచి అమలులోకి తీసుకురావాలని ఆర్బీఐకి సూచించింది.
వివరాలు
ఇంట్రాడే ట్రేడింగ్లో పెరిగిన ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు
ఈ ప్రకటన వెలువడిన వెంటనే, బంగారం తాకట్టు రుణాలపై ఆధారపడి పనిచేసే ఆర్థిక సంస్థల షేర్లలో భారీ లాభాలు నమోదయ్యాయి.
ముఖ్యంగా ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు ఇంట్రాడే ట్రేడింగ్లో 8.6 శాతం పెరిగి రూ.2,243 వద్ద గరిష్ఠ స్థాయిని తాకాయి.
మణప్పురం ఫైనాన్స్ షేర్లు 4 శాతం పెరిగాయి, ఇక ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 2 శాతం పెరిగింది.
ముత్తూట్ సంస్థ మంజూరు చేసే రుణాల్లో 98 శాతం వరకు బంగారం తాకట్టు ఆధారిత రుణాలే కావడం గమనార్హం.