Page Loader
Gold price: దేశంలో బంగారం ధర పరుగు కొనసాగుతోంది.. ఒక్క నెలలోనే దాదాపు రూ.5వేలు జంప్ 
దేశంలో బంగారం ధర పరుగు కొనసాగుతోంది.. ఒక్క నెలలోనే దాదాపు రూ.5వేలు జంప్

Gold price: దేశంలో బంగారం ధర పరుగు కొనసాగుతోంది.. ఒక్క నెలలోనే దాదాపు రూ.5వేలు జంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
08:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) పసిడి ధర సరికొత్త గరిష్ఠాన్ని తాకింది. కేవలం ఒక్క రోజులోనే రూ.1100 పెరిగి, దేశ రాజధాని ఢిల్లీలో రూ.84,900కి చేరుకుంది. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర రూ.79,390గా ఉండగా, నెలాఖరుకు రూ.5,510 మేర పెరగడం గమనార్హం.

వివరాలు 

క్షీణించిన రూపాయి విలువ  

అదే విధంగా, వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ.95,000 దాటింది. గురువారం కిలో వెండి రూ.94,150గా ఉండగా, ఒక్కరోజులోనే రూ.850 పెరిగింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు)బంగారం ధర 2800 డాలర్ల మార్కును దాటి, ఇంట్రాడేలో 2859 డాలర్లకు చేరుకుంది. రూపాయి బలహీనత కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా క్షీణించింది. దీన్ని నియంత్రించేందుకు, అలాగే బంగారం దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచవచ్చనే అభిప్రాయం వ్యాపార వర్గాల్లో నెలకొంది. దీంతో, ధర మరింత పెరుగుతుందనే అంచనాలతో ప్రజలు కొనుగోలు కొనసాగిస్తున్నారు.అయితే, ఎలాంటి మార్పులు లేకపోతే బంగారం ధరలు తగ్గే అవకాశముంది.

వివరాలు 

వాణిజ్య యుద్ధ భయాలు 

అంతేకాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెక్సికో, కెనడా, చైనా వంటి దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించడం వాణిజ్య యుద్ధ భయాలను పెంచుతోంది. ఇది కూడా బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.