
Stock market: యుద్ధ ప్రభావం.. నిఫ్టీ 25 వేలకే పరిమితం, మళ్లీ నష్టాల్లో సూచీలు!
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ లపై మళ్లీ అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకోవడంతో పాటు ఇరాన్ అణుకేంద్రాలపై దాడులు జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు మన మార్కెట్లూ తీవ్ర నష్టాలను చవిచూశాయి. చమురు ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందన్న భయాలు కూడా మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఐటీ షేర్లు ప్రధానంగా నష్టపోగా, నిఫ్టీ స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలు మాత్రం భౌగోళిక ఉద్రిక్తతలను తట్టుకుని నిలబడడం విశేషం. ఇంట్రాడేలో భారీ నష్టాలు చవిచూసిన సూచీలు, ఆఖర్లో కొంత కోలుకున్నాయి. ఒక దశలో 900 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్ చివరికి 500 పాయింట్ల నష్టంతో గట్టెక్కింది. నిఫ్టీ మళ్లీ 25,000 పాయింట్ల దిగువన ముగిసింది.
Details
డాలరుతో రూపాయి మారక రేటు 86.76
సెన్సెక్స్ ఉదయం 81,704.07 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు: 82,408.17) భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 81,476.76 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ, మధ్యాహ్నం తర్వాత కొంత కోలుకుంది. చివరికి 511.38 పాయింట్ల నష్టంతో 81,896.79 వద్ద స్థిరపడింది. నిఫ్టీ140.50 పాయింట్లు నష్టపోయి 24,971.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారక రేటు 86.76గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలీవర్ ప్రధానంగా నష్టపోగా, ట్రెంట్, బీఈఎల్, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 77.35డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు 3,381 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.