Page Loader
Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్
పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: పెట్టుబడులపై భారతదేశం మంచి రాబడిని అందిస్తోంది: నిర్మలా సీతారామన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 17, 2025
03:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ ఈక్విటీ మార్కెట్‌లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FII) నష్టాల స్వీకరణ కారణంగా వెనక్కి వెళ్లిపోతుండటం పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. భారత్‌లో పెట్టుబడిదారులకు మంచి లాభాలు వస్తున్నాయని, అందువల్లే వారు లాభాలను స్వీకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం భారత్‌లో అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ముంబయిలో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆర్థిక శాఖ కార్యదర్శి తుహిన్‌కాంత పాండే మాట్లాడుతూ, ప్రపంచ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఇది సహజంగా జరుగుతున్న పరిణామమని తెలిపారు. ముఖ్యంగా అమెరికాకు చెందిన ఎఫ్‌ఐఐలు మళ్లీ తమ దేశానికి వెళ్లిపోతున్నారని వివరించారు.

వివరాలు 

బీమా హామీ మొత్తాన్ని రూ.5 లక్షలకు మించి పెంచే అవకాశం 

అయితే, భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలుస్తోందని, భవిష్యత్తులో కూడా ఈ వృద్ధి కొనసాగుతుందని తెలియజేశారు. ద్రవ్యోల్బణం విషయంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన నిర్మలా సీతారామన్‌, ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సరఫరా పరంగా అవసరమైన చర్యలు తీసుకుంటోందని, డిమాండ్‌ పరంగా ఆర్‌బీఐ తగిన నిర్ణయాలు తీసుకుంటోందని వివరించారు. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారెంటీ కార్పొరేషన్‌ కింద ఉన్న బీమా హామీ మొత్తాన్ని రూ.5 లక్షలకు మించి పెంచే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం. నాగరాజు వెల్లడించారు.