LOADING...
Smart Phones to the United States:అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా చైనాను అధిగమించి అగ్రస్థానంలో భారత్‌ 

Smart Phones to the United States:అమెరికాకు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ఎగుమతిదారుగా చైనాను అధిగమించి అగ్రస్థానంలో భారత్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 30, 2025
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

టారిఫ్‌ల వివాదాలు అమెరికాకు చైనా స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు నెమ్మదించడాన్ని భారత్‌ అవకాశంగా మల్చుకుంటోంది. 2025 రెండో త్రైమాసికంలో భారత్‌ తొలిసారిగా అమెరికాకు చైనాను మించి ఎక్కువ స్మార్ట్‌ఫోన్లు ఎగుమతి చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ "కెనాలిస్‌" తన తాజా నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం, 2023 ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య కాలంలో అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్‌ఫోన్లలో చైనాలో తయారైన ఫోన్ల వాటా 61 శాతంగా ఉండగా, 2024 అదే త్రైమాసికంలో ఈ వాటా 25 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో, భారత్‌ వాటా 13 శాతం నుండి భారీగా పెరిగి 44 శాతానికి చేరింది. ఇది సుమారు 240 శాతం వృద్ధిని సూచిస్తుంది.

వివరాలు 

 83 లక్షల యూనిట్లకు పెరిగిన శాంసంగ్‌ ఫోన్ల ఎగుమతులు

క్యూ2లో (Q2) ఐఫోన్ల ఎగుమతులు ఏడాదిలో 11 శాతం తగ్గి 1.33 కోట్ల యూనిట్లకు పరిమితం అయ్యాయి. అదే సమయంలో శాంసంగ్‌ ఫోన్ల ఎగుమతులు 38 శాతం పెరిగి 83 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. టాప్‌-5 బ్రాండ్లకు చెందిన ఫోన్ల విషయానికొస్తే, మోటరోలా ఫోన్ల ఎగుమతులు 2 శాతం పెరిగి 32 లక్షల యూనిట్లకు, గూగుల్‌ ఫోన్లు 13 శాతం పెరిగి 8 లక్షల యూనిట్లకు చేరగా, టీసీఎల్‌ ఫోన్లు మాత్రం 23 శాతం తగ్గి 7 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి.

వివరాలు 

రెండో త్రైమాసికంలో భారత్‌కు తొలి విజయం..

కెనాలిస్‌ సంస్థ ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ సన్యమ్‌ చౌరాసియా వెల్లడించిందేంటంటే, అమెరికాకు ఎగుమతయ్యే స్మార్ట్‌ఫోన్ల తయారీ కేంద్రంగా భారత్‌ తొలిసారిగా క్యూ2లో ప్రాధాన్యత పొందిందని తెలిపారు. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య అస్థిరత నేపథ్యంలో యాపిల్‌ సంస్థ తన సరఫరా వ్యవస్థను భారత్‌వైపు మళ్లించడం ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. చైనా ప్లస్‌వన్‌ వ్యూహంలో భాగంగా, గత కొన్ని సంవత్సరాలుగా ఆపిల్ భారత్‌లో తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరుస్తూ వస్తోందని ఆయన వివరించారు. అయితే, తాజాగా ప్రారంభించిన ఐఫోన్‌ 16 సిరీస్‌ ప్రో మోడల్స్‌ను భారత్‌లో తయారు చేస్తున్నప్పటికీ, ఇంకా పెద్దఎత్తున సరఫరా కోసం యాపిల్‌ చైనాలో ఉన్న తయారీ కేంద్రాలపైనే ఆధారపడుతోందని చౌరాసియా తెలిపారు.

వివరాలు 

భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్న శాంసంగ్‌, మోటరోలా

యాపిల్‌ తరహాలోనే మోటరోలా కూడా ప్రధాన తయారీ కేంద్రంగా చైనాను వినియోగిస్తున్నట్లు చెప్పారు. అయితే, అమెరికాకు ఉత్పత్తుల ఎగుమతుల విషయంలో శాంసంగ్‌, మోటరోలా లాంటి సంస్థలు యాపిల్‌తో పోలిస్తే కొంత తక్కువ పరిమాణంలో అయినా భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉన్నాయని వివరించారు. శాంసంగ్‌ ప్రస్తుతం ఎక్కువగా తన స్మార్ట్‌ఫోన్లను వియత్నాంలో తయారు చేస్తోందని ఆయన తెలిపారు.